జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
పహాడీషరీఫ్: బస్తీల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్లో భాగంగా శనివారం ఆయన జల్పల్లి సర్కిల్ పరిధిలో పర్యటించారు. ప్రధాన రహదారులపై పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికీ చెత్త సేకరణకు ఆటోలు వస్తున్నాయా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పహాడీషరీఫ్ ఈద్గాను పరిశీలించి రంజాన్కు తగిన ఏర్పాట్లు చేయాలని శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ, జల్పల్లి డిప్యూటీ కమిషనర్ బి.వెంకట్రామ్కు సూచించారు. రోడ్లపై చెత్తా చెదారం వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ (ఎస్డబ్ల్యూఎం) ఇష్రత్ ఆయేషా తన్వీర్, గ్రూప్–1 ట్రెయినీ అధికారి స్వర్ణలత, ఏఈ వినిత్, శానిటరీ ఇన్స్పెక్టర్ మోయిన్ బాబా తదితరులు పాల్గొన్నారు.


