స్వచ్ఛ ఆటో కార్మికుల పొట్టకొట్టొద్దు
హుడాకాంప్లెక్స్ : ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తోందని తెలంగాణ స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికుల యూనియన్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు గోపాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఇంటి పన్నుతోనే చెత్త సేకరణ డబ్బులు వసూలు చేసే విధంగా మున్సిపల్ అధికారులు రాంకీ సంస్థ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎల్బీన గర్ సర్కిల్ కార్యాలయం ఎదుట గురువారం గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో కార్మికుల సంఘం అధ్యక్షుడు కాట్రవత్ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థకు వ్యతిరేకంగా ఈనెల 23న జిహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. తమ తాత, తండ్రుల నుంచి చెత్త సేకరణ చేసి జీవనం కొనసాగిస్తున్నామని, తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త సేకరించగా వచ్చిన డబ్బులతోనే తమ కుటుంబ పోషణ జరుగుతోందని, వాటిని కూడా ఇంటి పన్నుల్లో వసులు చేసి తమ కడుపు కొట్టాలని చూడడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే తన వైఖరి మార్చుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వంశ రాజు, అర్జున్, శేఖర్, మచ్చ గిరి, చెక్క శీను, వీరస్వామి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


