కుక్కల భద్రత యజమానులదే
యాచారం: కుక్కల దాడులతో ప్రజల్లో భయాందోళన ఉందని, గొర్రెలు, మేకలు, పశువులపై దాడులు చేసి చంపేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం యాచారంలో వీధి కుక్కలను విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపేయడం సంచలనంగా మారడంతో స్పందించిన ఆయన శనివారం పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుక్కలను చంపడం సరైంది కాదన్నారు. భద్రత చేపడుతూనే మిగతా వారికి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత యజమానులదేనని స్పష్టం చేశారు. కోతులతో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ పొలాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం నాబార్డు నుంచి రుణాలు అందజేసేలా రైతు కమిషన్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సర్పంచ్ మస్కు అనితశరణం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తహసీల్దార్ అయ్యప్ప, మండల ప్రత్యేధికారి మాధవరావు, డీఎల్పీఓ సాధన, ఎంపీఓ శ్రీలత, పశువైద్యాధికారులు రేఖ, కిరణ్కుమార్, మండల వ్యవసాయాధికారి రవినాథ్, ఎస్ఐ మధు, పంచాయతీ కార్యదర్శి కిషన్ తదితరులు పాల్గొన్నారు.
చదువుతో పాటు క్రీడలు ముఖ్యం
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ క్రీడాపోటీలకు హాజరైన ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రోత్సహించారు. గ్రామీణా ప్రాంత విద్యార్థులు, యువత క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి


