వారికే బీఫాం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పురపోరులో ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆయా మున్సిపల్ పీఠాలపై తమ తమ పార్టీ జెండాలు ఎగురవేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా పార్టీలు ముఖ్య నేతలను పరిశీలకులుగా నియమించాయి. వారు వార్డుల వారీగా సమావేశమై అంతర్గత సర్వే చేపట్టి ఒక్కో వార్డు నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సేకరించి, పార్టీ అధిష్టానానికి చేరవేస్తున్నారు. జనరల్ స్థానాల్లో అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల మధ్య గట్టిపోటీనే ఉంది. ఇలాంటి చోట ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న వారితో పాటు సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉండి, ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న అభ్యర్థులకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రచారం సైతం ప్రారంభించారు. మంగళవారం ఎన్నికల నోటిషికేషన్ విడుదల కావడంతో బుధవారం ఆయా పార్టీల నేతలు మున్సిపాలిటీల వారీగా సమావేశాలు నిర్వహించి, కేడర్ను ఏకతాటిపైకి తీసుకొచ్చే పనిలోపడ్డారు. ఇతర పార్టీల్లో బలమైన నేతలను గుర్తించి, వారికి పార్టీ తరపున బీఫాం ఆఫర్ చేస్తుండడం గమనార్హం. ఇప్పటికే చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, ఆమనగల్లు నియోజకవర్గాల్లో పార్టీ కండువాల మార్పు జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుండగా, బీజేపీ మాత్రం కొంత స్తబ్ధుగా కన్పిస్తోంది.
తొలి రోజు 40 నామినేషన్లు
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో భాగంగా బుధవారం జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు.. 126 వార్డుల నుంచి 39 మంది అభ్యర్థులు 40 నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో బీజేపీ నుంచి మూడు, సీపీఐఎం నుంచి ఒకటి, కాంగ్రెస్ నుంచి 22, బీఆర్ఎస్ నుంచి 12 సహా ఇండిపెండెంట్ల నుంచి రెండు నామినేషన్లు వచ్చాయి. ఆమనగల్లు, శంకర్పల్లిలో మున్సిపాలిటీలో ఎనిమిది చొప్పున, చేవెళ్లలో తొమ్మిది, ఇబ్రహీంపట్నంలో మూడు, మొయినాబాద్, షాద్నగర్లో ఆరు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల పరిశీలకులు మయాంక్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని సందర్శించి, రిటర్నింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఇప్పటి కే ఆయా మున్సిపాలిటీలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. అభ్యర్థులకు నామినేషన్ పత్రాల అందజేత మొదలు.. స్వీకరణ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంతకు ముందు కలెక్టరేట్లో పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, నోడల్ అధికారి శ్రీలక్ష్మి, హౌసింగ్ పీడీ చంప్లానాయక్ పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు కొంగరకళాన్లోని కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్, మీడియా సెల్, ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 98499 06949 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదులకు ఈ నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. వచ్చిన ప్రతీ ఫిర్యాదును రికార్డు చేస్తామన్నారు. మద్యం, డబ్బు పంపిణీ సహా రెచ్చగొట్టే ప్రసంగాలు వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల పరిశీలకులు మయాంక్ మిట్టల్ నోడల్ అధికారులతో సమావేశం అయ్యారు. ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అంతా సహకరించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ మొదలు.. పరిశీలన, తుది జాబితా విడుదల, పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఓటింగ్ ప్రక్రియ, లెక్కింపు ఇలా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
‡
‡
ఆర్థిక బలం, జనాదరణ ఉన్నవారికే టికెట్
అన్ని పార్టీలది అదే తీరు
వార్డుల వారీగా సర్వేలు.. బలమైన అభ్యర్థుల ఎంపిక
తొలి రోజు 40 నామినేషన్ల దాఖలు
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నారాయణరెడ్డి
వారికే బీఫాం
వారికే బీఫాం


