భూ పరిహారం పెంచండి
కందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం ముచ్చర్ల రెవెన్యూలో మరోసారి తీసుకోనున్న భూములకు పరిహారం పెంచాలని రైతులు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నారు. బుధవారం తహసీల్దార్ కె.గోపాల్ సమక్షంలో ముచ్చర్లలో నిర్వహించిన గ్రామసభలో ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని 123 సర్వే నంబర్లలో ఉన్న 47.6 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా రైతులకు పరిహారం ఇచ్చి తీసుకోనున్నట్లు ఆర్డీఓ రైతులకు వివరించారు. ఇక్కడ ప్రభుత్వ మార్కెట్ విలువ ఎకరాకు రూ.19 లక్షలు ఉందన్నారు. కేంద్రం చట్టం 30/2013 పారదర్శకత, నష్టపరిహారం పొందే హక్కు ప్రకారం ప్రభుత్వం ఎకరానికి రూ.60లక్షల పరిహారం మంజూరు చేసే అవకాశాలున్నాయని తెలిపారు. కాగా 47 ఎకరాల్లో ఇప్పటికే 21 ఎకరాలు ప్లాట్లుగా ఉన్నట్లు రెవెన్యూ(సర్వే) అధికారులు గుర్తించారని చెప్పారు. ఇందుకు గజానికి రూ.6,300 చొప్పున పరిహారం మంజూరు అవుతుందన్నారు. అభ్యంతరాలుంటే తహసీల్దార్ కార్యాలయంతో పాటు తన దృష్టికి తీసుకొస్తే రైతుల విన్నపాలను కలెక్టర్ నారాయణరెడ్డికి వివరిస్తామన్నారు. దీంతో రైతులు మూకుమ్మడిగా పరిహారం పెంచాలని ఎంతో కావాలో తాము చర్చించుకుని అధికారుల దృష్టికి తీసుకోస్తామని వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్ రాజు, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ సీఐ సత్యనారాయణ, సర్పంచ్ ఊటు పద్మ మహేందర్, ఉప సర్పంచ్ రవి, ఆర్ఐ శ్రీకాంత్, టీజీఐఐసీ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
అధికారులకు ముచ్చర్ల రైతుల వినతి


