మృత్యుపాశాలు! | - | Sakshi
Sakshi News home page

మృత్యుపాశాలు!

Jun 16 2025 7:21 AM | Updated on Jun 16 2025 7:21 AM

మృత్యుపాశాలు!

మృత్యుపాశాలు!

నెత్తిన

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇళ్లలో వెలుగులు నింపాల్సిన విద్యుత్‌ తీగలు.. పౌరుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. నెత్తిన మృత్యుపాశాల్లా వేలాడుతున్న వైర్లు ఎప్పుడు.. ఎవరిపై తెగిపడతాయో తెలియని దుస్థితి నెలకొంది. ఎలాంటి ఈదురు గాలులు, వర్షాలు లేకపోయినప్పటికీ.. వైర్లు తెగిపడుతుండటాన్ని పరిశీలిస్తే.. డిస్ట్రిబ్యూషన్‌ లైన్ల వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. విద్యుత్‌ లైన్ల నిర్వహణ కోసం డిస్కం ఏటా రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. అయినా ప్రమాదాలు తగ్గడంలేదు. తాజాగా సరూర్‌నగర్‌ డివిజన్‌ చింతల్‌కుంట ఫీడర్‌కు సంబంధించిన 11 కేవీ పోల్‌పై పాలిమర్‌ పిన్‌ ఇన్సులేటర్‌లోని మెటల్‌ రాడ్డు విరిగిపడి, హైటెన్షన్‌ విద్యుత్‌ కేబుల్‌ తెగిపడటంతో.. సాగర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని ఓ దేవాలయం ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న ఓ మహిళ, పురుషుడు (యాచకులు) విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు. విద్యుత్‌ ఇంజినీర్లు మాత్రం తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు గుర్తు తెలియని ఓ వాహనం స్తంభాన్ని ఢీకొనడంతోనే వైర్లు తెగిపడినట్లు చెబుతున్నారు.

నిర్వహణ లోపంతోనే..

ఇప్పటికీ నిజాం కాలం నాటి ఓవర్‌హెడ్‌ లైన్లు, ఇనుప స్తంభాలే ఉన్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. తరచూ వైర్లు తెగిపడుతుండటంతో పాటు స్తంభాలను ముట్టుకుంటే షాక్‌ కొడుతున్నాయి. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, లూజు లైన్లు సరి చేయడం, దెబ్బతిన్న పిన్‌ ఇన్సులేటర్లను మార్చడం, పాడైన ఫ్యూజ్‌ బాక్సులను మార్చడం, డీటీఆర్‌ల వద్ద పటిష్టమైన ఎర్తింగ్‌ ఏర్పాటు చేయడం వంటి పనుల కోసం డిస్కం ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. కంపెనీ కేటాయించిన నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి తప్ప.. సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడటం లేదు. క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు ఎప్పటికప్పుడు లైన్‌ టు లైన్‌, పోల్‌ టు పోల్‌ తిరిగి ప్రమాదకరంగా మారిన వాటిని గుర్తించి, వాటి స్థానంలో కొత్త వైర్లు, స్తంభాలు, పిన్‌ ఇన్సులేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. లైన్ల పునరుద్ధరణ అంటే కేవలం చెట్ల కొమ్మల తొలగింపు ఒక్కటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ప్రతిపాదనలకే సరి..

వేలాడుతున్న వైర్లను తొలగించి, వాటి స్థానంలో భూగర్భ విద్యుత్‌ కేబుళ్లను ఏర్పాటు చేయాలని డిస్కం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఇంజినీర్ల బృందం ఇటీవల బెంగళూరులో పర్యటించి భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ పనులను పరిశీలించి వివరాలను సేకరించింది. 3,400 కిలోమీటర్ల 33 కేవీ, 11,500 కిలోమీటర్ల 11 కేవీ లైన్లలో యూజీ కేబుళ్లు లైన్లు, 15 వేల కిలోమీటర్ల ఏబీ కేబుల్‌ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందు కోసం రూ.13,600 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసింది. బకాయిలు భారీగా పేరుకపోవడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో డిస్కం ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం నిధుల్లేవంటూ చేతులెత్తేసింది. కేంద్రం దయతలచి ఏదైనా స్కీం ప్రకటిస్తే గాని.. ఈ పనులు ఇప్పట్లో పూర్తికాని పరిస్థితి నెలకొంది.

ప్రాణాంతకంగా వేలాడుతున్న విద్యుత్‌ తీగలు

తరచూ తెగిపడుతున్న వైర్లు

లైన్ల పునరుద్ధరణకు ఏటా రూ.100 కోట్లకుపైగా ఖర్చు

అయినా మెరుగుపడని పంపిణీ వ్యవస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement