
గంజాయి విక్రేతకు రిమాండ్
నందిగామ: కార్మికులకు గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటన శనివారం నందిగామ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బీహార్ రాష్ట్రం బాక్సుర్ జిల్లాకు చెందిన రవీందర్ పాశ్వాన్ కొంతకాలం క్రితం నందిగామకు వలస వచ్చి స్థానిక పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన సొంతూరునుంచి గంజాయి తీసుకువచ్చి స్థానికంగా ఉంటున్న కార్మికులకు విక్రయిస్తూ అక్రమ సంపాదనకు అలవాటుపడ్డాడు. ఉదయం పారిశ్రామిక వాడ సమీపంలోని చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. ఆయన వద్ద 500 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. దీంతో నిందుతుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.