సిరిసిల్ల: జిల్లాలో మొహరం సందర్భంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సోమవారం సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పో లీసు అధికారులను కోరారు. జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అయేషా తలత్, జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాస్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖధీర్పాషా పాల్గొన్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ప్రవేశాలు
జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. 1వ తరగతి (నాన్ రెసిడెన్షియల్) ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 109 దరఖాస్తులు రాగా బాలికలకు 33 శాతం రిజర్వేషన్ ప్రకారం 15 సీట్లు, జనరల్ కేటగిరీలో 31 సీట్లను ఎంపిక చేశారు. డీఎస్సీడీవో రవీందర్రెడ్డి, డీఈవో జగన్మోహన్రెడ్డి, గురుకులాల కో–ఆర్డినేటర్ జాస్మిన్ థెరిస్సా, సహాయ సంక్షేమాధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి పెద్దపీట
సిరిసిల్లటౌన్: ప్రధాని నరేంద్రమోదీ పన్నెండేళ్ల పాలనలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనాల సన్నాహక సమావేశాన్ని సిరిసిల్లలో సోమవారం నిర్వహించారు. గోపి మాట్లాడుతూ ఈనెల 20 వరకు వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనాల ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, ఆడెపు రవీందర్, రాంప్రసాద్, రాజు, రాజాసింగ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లు నెరవేర్చాలని ఐక్యవేదిక జిల్లాశాఖ ప్రతినిధులు కోరారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన తెలిపి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచిన ఉద్యమకారులను పట్టించుకోవడం లేదన్నారు. ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గరిపెల్లి ప్రభాకర్, కో కన్వీనర్ ఆడెపు రవీందర్, బియ్యంకార్ శ్రీనివాస్, కుసుమ విష్ణు ప్రసాద్, సభ్యులు చిప్ప దేవదాస్, కుసుమ గణేశ్, వెంగళ వెంకటేశం పాల్గొన్నారు.


