కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్లలో 2కే రన్
సిరిసిల్ల: విద్యార్థులు, యువతలో ఆరోగ్యం.. ఫిట్నెస్పై అవగాహన కల్పించేందుకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా యువజన క్రీడావారోత్సవాల్లో 2కే రన్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2కే రన్ను యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గితే జెండా ఊపి రన్ను ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపరెడ్డి, డీవైఎస్వో రాందాస్ పాల్గొన్నారు.
లారీల సంఖ్య పెంచాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీల సంఖ్య పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం తూకం వేయడం, బస్తాలను మిల్లులకు, గోదాములకు తరలించడంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. రైస్మిల్లులు, అపెరల్పార్క్లో ధాన్యం అన్లోడింగ్ చేయడానికి హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. రైస్మిల్లర్లు, లారీ కాంట్రాక్టర్లతో ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి సమీక్షించారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీసీఎస్వో బుచ్చిబాబు, మేనేజర్ నరసింహా, డీసీవో రామకృష్ణ పాల్గొన్నారు.
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్ల పంపిణీ
కలెక్టరేట్లో ఇద్దరు దివ్యాంగుల ఇబ్బందులను చూసి చలించిన కలెక్టర్ వెంటనే బ్యాటరీ సైకిళ్లను అందించారు. కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన ఉప్పుల శ్రీనివాస్, ముస్తాబాద్ మండలం
గూడెం కొమిరే పరశురాములుకు బ్యాటరీ సైకిళ్లను అందజేశారు .
22న జిల్లా స్థాయి సభకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 22న నిర్వహించే జిల్లా స్థాయి సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఆరు గ్యారంటీలు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలతో కరపత్రం రూపొందించాలన్నారు. ప్రభుత్వం శాఖలు స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్డీవోలు రాజేందర్రెడ్డి, కేఎస్బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి పాల్గొన్నారు.


