● నిద్ర లేక ప్రజల ఇబ్బందులు ● తెగిన లైన్ కోసం చీకట్లో వెతుకులాట
బోయినపల్లి(చొప్పదండి): మండల కేంద్రంలో గురువారం రాత్రి విద్యుత్తీగలు తెగిపోయి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో కరెంట్ పోయింది. సరిగ్గా నిద్రలోకి జారుకునే సమయంలో విద్యుత్ పోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తెగిన విద్యుత్లైన్ కోసం గ్రామ యువకులు, విద్యుత్ సిబ్బంది రాత్రంతా వెతికారు. కరెంట్ లేక ఉక్కపోత, దోమలబెడత భరించలేక ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. వాట్సాప్ గ్రూప్ల్లో కరెంట్ ఎప్పుడు వస్తుంది.. ఎండాకాలంలో ఇలా అయితే చినుకులు పడితే కరెంట్ ఉంటుందా? అని వాపోయారు. కొద్ది రోజులుగా బోయినపల్లిలో కరెంట్పోవడం కామన్గా మారింది. గ్రామ యువకులు, విద్యుత్ సిబ్బంది రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తెగిన విద్యుత్లైన్ కోసం వెతకగా ఉదయం 4:50 గంటల సమయంలో లైన్ ఎక్కడ తెగిందో తెలిసింది. లైన్ తెగిన చోటులో గుర్తించి సరిచేయడంతో శుక్రవారం తెల్లవారుజామున కరెంట్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


