సిరిసిల్లఅర్బన్: గ్రామాలను పురపాలికల్లో విలీనం
చేస్తే అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఆశించారు. అప్పట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అదే విషయమై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులను ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినా కొందరు నాయకులు, ప్రజలు పట్టణంలో విలీనం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వారి అభిప్రాయాన్ని పక్కన పెట్టి అప్పటి నాయకులు ఆయా గ్రామాల ప్రజలను ఒప్పించి 2019లో సిరిసిల్ల మండలంలోని 7 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విలీన గ్రామాల్లో అభివృద్ధి అనేది అంతంత మాత్రమే ఉందని, విలీన గ్రామాల ప్రజలకు
ఉపాధి కరువైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
7 గ్రామాలు చేరిక...
పాత సిరిసిల్ల మండలం గ్రామాలైన పెద్దూరు, సర్ధాపూర్, చిన్నబోనాల, పెద్దబోనాల, ముష్టిపల్లి, చంద్రంపేట, రగుడు గ్రామాలను సిరిసిల్ల మున్సిపల్లో విలీనం చేశారు. అయితే ఎన్నికల ముందు మాత్రం తాము అధికారంలోకి రాగానే విలీన గ్రామాలను తిరిగి పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు హామీ ఇచ్చారు. కానీ, వారి మాటలు హామీలుగానే మిగిలిపోయాయి. తాజాగా హైకోర్టు 90 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో విలీన గ్రామాల ప్రజలు పంచాయతీలుగా ఏర్పాటు చేస్తారా..? లేక మున్సిపల్లోనే కొనసాగిస్తారా..? అనే అయోమయంలో ఉన్నారు.
● విలీన గ్రామాల్లో అయోమయం
● రానున్న స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ
● హామీలుగానే మిగిలిన నాయకుల మాటలు
● గ్రామాల్లో కానరాని అభివృద్ధి
● ఉపాధి పనులకు దూరమైన ప్రజలు
పంచాయతీలుగా ప్రకటించాలి
మాది చంద్రంపేట. 2006 నుంచి 2011 వరకు గ్రామ సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించా. అప్పుడు గ్రామాలకు ప్రత్యేక నిధులు ఉండేవి. వాటితో పాటు ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు జరిగేవి. మున్సిపల్లో విలీనం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి అనే పదానికే దూరంగా ఉంది. గ్రామంలో నెలకొన్న సమస్యలపై మున్సిపల్ వాళ్లకు చెబితే పట్టించుకునే నాథ/డే కరువయ్యాడు. తిరిగి గ్రామ పంచాయతీ చేస్తేనే బాగుంటుంది.– అన్నవేని బాలయ్య, మాజీ సర్పంచ్, చంద్రంపేట
ప్రత్యేక మండలం ఏర్పాటు చేయాలి
పాత సిరిసిల్ల మండలంలోని 7 గ్రామాలతోపాటు పక్కనే ఉన్న కొలనూరు, వెంకటాపూర్, పోతిరెడ్డిపల్లె గ్రామాలను కలుపుకొని ప్రత్యేక మండలం చేస్తే ప్రజలకు పరిపాలన పరంగా, అన్ని విధాల దగ్గరవుతుంది. పంచాయతీలుగా ఉన్నప్పుడే గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. అప్పటి కల్టెకర్ నీతూకుమారి ప్రసాద్ ముష్టిపల్లిని దత్తత తీసుకొని గ్రామాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లారు. సంపూర్ణ అక్షరాస్యత గల గ్రామంగా పేరు తీసుకొచ్చారు. జాతీయ అవార్డులు సైతం వచ్చాయి. అలాంటిది అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉంది. – వంతడుపుల రాము, మాజీ సర్పంచ్, ముష్టిపల్లి
సౌలభ్యంగా ఉంటది
గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు గ్రామాలు చాలా అభివృద్ధి పథంలో ఉన్నాయి. ఎప్పుడైయితే సిరిసిల్ల మున్సిపల్లో విలీనం చేశారో గ్రామస్తులకు ఉపాధి కరువైయింది. పాలనాపరంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తిరిగి గ్రామ పంచాయతీలు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి.– నవీన్యాదవ్, పెద్దూరు
సిరిసిల్ల పట్టణ ప్రొఫైల్
పట్టణ జనాభా 1,17,000
విలీనమైనవి 7 గ్రామాలు
విలీన గ్రామాల జనాభా 16,000
7 గ్రామాల్లో వార్డులు 72
7 గ్రామాల్లో ఎంపీటీసీ స్థానాలు 4
(29 ఎస్ఆర్ఎల్55)
(29 ఎస్ఆర్ఎల్56)
మున్సిపలా.. పంచాయతా..?
మున్సిపలా.. పంచాయతా..?
మున్సిపలా.. పంచాయతా..?
మున్సిపలా.. పంచాయతా..?