
ప్రశాంతంగా సర్వేయర్ల పరీక్ష
సిరిసిల్లటౌన్: గ్రామపాలన అధికారులు (జీపీవో), లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందీప్కుమార్ ఝా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగా, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు 39 మంది అభ్యర్థులకు 35 మంది హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. లైసెన్స్్డ్ సర్వేయర్ల పరీక్షకు ఉదయం సెషన్లో 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన థియరీ పరీక్షకు 156 మంది అభ్యర్థులకు 141, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ సెషన్ ప్లాటింగ్ పరీక్షకు 156 మందికి 139 మంది హాజరయ్యారని వివరించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, సీపీవో శ్రీనివాసాచారి, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సమ్మేళనంలో కవులకు సత్కారం
సిరిసిల్లటౌన్: హైదరాబాద్లో జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో జిల్లా కవులకు సన్మానం చేశారు. పోలీసులు– సామాజిక బాధ్యతపై జాతీయ తెలుగు సారస్వత పరిషత్, తెలంగాణ పోలీస్ శాఖ, ఓ జాతీయ తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో ఆదివారం కవి సమ్మేళనం జరిగింది. జిల్లా సాహితి సమితి అధ్యక్షుడు డాక్టర్ జనపాల శంకరయ్య సర్వజన సంరక్షకుడు రక్షక భటుడు అనే అంశంపై తన కవితను ధారాళంగా ఆలపించారు. బాలసాహితీవేత్త డాక్టర్ వాసరవేణి పరుశురాం శ్రీరక్షకభటుల్ఙు కవిత చదివారు. సాహితీ సమితి కార్యదర్శి ముడారి సాయిమహేశ్ రక్షణ విలువ అనే అంశంపై తన కవితను వినిపించారు.
బాల సాహితీవేత్తలు.. పుస్తకావిష్కరణలు
సిరిసిల్లకల్చరల్: జిల్లాకు చెందిన ఇద్దరు బాలసాహిత్యకారుల పుస్తకాల ఆవిష్కరణ సభ హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై ఆదివారం నిర్వహించారు. మారసం వ్యవస్థాపకుడు డాక్టర్ పత్తిపాక మోహన్, గరిపెల్లి అశోక్ వెలువరించిన ‘ఆకుపచ్చ పాట’కు షేక్ అబ్దుల్ ఘనీ చేసిన అనువాదం హరేభరే గీత్ పుస్తకంతో పాటు అశోక్ వెలువరించిన ‘గోటీలాట’ పుస్తకాలను ముఖ్య అతిథిగా హాజరైన ఉస్మానియా వర్సిటీ తెలుగుశాఖ పూర్వాధ్యక్షుడు డాక్టర్ కసిరెడ్డి వెంకట్రెడ్డి ఆవిష్కరించారు. మాడభూషి లలితాదేవి, డాక్టర్ అమరవాది నీరజ, డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు, శీలా సుభద్రాదేవి, డాక్టర్ చెరుకుపల్లి హారిక అతిథులుగా హాజరయ్యారు. ఆవిష్కర్త మాట్లాడుతూ, బాలసాహిత్య వికాసానికి కృషి చేస్తున్న కవులను ప్రశంసించారు. ఈ సందర్భంగా మోహన్, అశోక్ను మానేరు కవులు అభినందించారు.
ఊరు బాగుండాలని..
● జనగామ నుంచి వేములవాడకు పాదయాత్ర
వేములవాడ: తమ ఊరు బాగుండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో తులతూగాలని, వర్షాలు సకాలంలో కురిసి పాడిపంటలు బాగుండాలని జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన దరావత్ రాజు ముత్తారం నుంచి వేములవాడ రాజన్న చెంతకు పాదయాత్రగా ఆదివారం రాత్రి చేరుకున్నాడు. ఈనెల 25న ఉదయం 6 గంటలకు పాదయాత్ర ప్రారంభించి జనగామ, బచ్చన్నపేట, చేర్యాల, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా వేములవాడకు చేరుకున్నట్లు రాజు తెలిపాడు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాడు.

ప్రశాంతంగా సర్వేయర్ల పరీక్ష

ప్రశాంతంగా సర్వేయర్ల పరీక్ష

ప్రశాంతంగా సర్వేయర్ల పరీక్ష