
సర్కార్ బడి..సేవకుల గుడి
● సమాజ సేవలో ముస్తాబాద్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ● వైద్యులు..ఉపాధ్యాయులుగా సేవలు ● బడి రుణం తీర్చుకుంటున్న పలువురు
ముస్తాబాద్(సిరిసిల్ల): సర్కార్ బడి.. ఈ పదమే నేడు చులకనగా మారింది. కానీ ప్రస్తుతం సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్న వారందరూ అక్కడే అక్షరాలు దిద్దినవారు. ముస్తాబాద్ ప్రభుత్వ హైస్కూల్లో చదివిన వారెందరో వైద్యులు.. ఉపాధ్యాయులుగా ఎదిగారు. ప్రభుత్వ బడిలో చదివి.. ఎదిగిన వారు తమ పిల్లలను రంగురంగుల భవనాలతో ఆకర్షిస్తున్న ప్రైవేట్ స్కూళ్లకు పంపుతూ.. వారు చదువుకున్న సర్కార్ బడిని చిన్నచూపు చూస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివి మార్గదర్శకులుగా నిలిచిన వారి విజయాల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ముస్తాబాద్ సర్కార్ బడిలో చదువుకుని నేడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారి గురించి తెలుసుకుంటే మనసు ఉప్పొంగుతుంది. విజేతలను అందించిన ఘనత ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలది. ఈ బడికి 75 ఏళ్ల చరిత్ర ఉంది. వైద్యులు చింతోజు శంకర్, చింతోజు రాజారాం, రాజకీయ నాయకుడు కేకే మహేందర్రెడ్డి, డీఎస్పీ కరెడ్ల శ్రీనివాస్రెడ్డి, జేఎన్టీయూ రిటైర్డ్ రిజిస్ట్రార్ తాండ్ర విఠల్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసిన పాపాలాల్, హైకోర్టు అడ్వకేట్ రాజమల్లారెడ్డి, ప్రొఫెసర్ ఆనందరెడ్డి, ఆర్డీవో గూడ సురేందర్రెడ్డి, బీఎస్ఎన్ఎల్ జిల్లా అధికారి చిన్ని సంజీవ్రెడ్డి.. ఇలాంటి వారు ఎందరో ఇక్కడే అక్షరాలు దిద్దారు. వారి స్ఫూర్తిగా ప్రభుత్వ బడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.