సంతనూతలపాడులో రౌండ్ టేబుల్ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున
సంతనూతలపాడు: మెగా డీఎస్సీ–2025లో జరిగిన విచ్చలవిడి అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ చేపట్టాలని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేరుగు మాట్లాడుతూ నీట్ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగానే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు. సంతనూతలపాడులోని పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ నాయకులతో కలిసి సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు బొట్ల రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. స్వయంగా హైకోర్టు ఆదేశించినా ఇంతవరకు విచారణ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. డీఎస్సీలో ఉద్యోగాలు ఇప్పించేందుకు రూ.15 లక్షలు డిమాండ్ చేస్తున్న వీడియోలు, ఆడియో టేపులు ప్రభుత్వానికి సమర్పించినా ప్రయోజనం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే విచారణపై తమకు నమ్మకం లేదని, సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలన్నారు. 2025 డీఎస్సీ తక్షణమే రద్దుచేసి మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో మెరిట్ లిస్టు ప్రకారం కాకుండా మనీ లిస్టు ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఊసే లేదని, అసలు అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా అని నిలదీశారు. యువత ధర్మ యుద్ధానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఐటీఐ, డిప్లొమా వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోందన్నారు. ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు, 10వ తేదీ నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారు బాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, సంయుక్త కార్యదర్శి వేమా శ్రీనివాసరావు, పాలడుగు రాజీవ్, రాష్ట్ర వాణిజ్య విభగం కార్యదర్శి కృష్ణారెడ్డి, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు, మండవ అప్పారావు, శ్రీమన్నారాయణ, దుంపా యలమందరెడ్డి, ఎంపీపీలు యద్దనపూడి శ్రీనివాసరావు, బి.విజయ, వాకా అరణ కోటిరెడ్డి, మాజీ ఏఎంసీ అధ్యక్షుడు ఇనగంటి పిచ్చిరెడ్డి, బొడ్డు కోటేశ్వరరావు, ఎస్ వెంగారెడ్డి, ఎస్ వెంకటరావు, స్టేట్ మైనారిటీ సెల్ నాయకుడు మస్తాన్, జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు పి.రామారావు, పార్టీ నాయకులు దుంపా అజయ్ రెడ్డి, చీదర్ల శేషు, పాటిబండ్ల గంగయ్య, రావి లక్ష్మయ్య, మక్కెన రాజేంద్ర, రవి, అన్వేష్, మహేష్, శ్రీకాంత్, పాలడుగు సుబ్బు, మొగులశెట్టి వెంకటేశ్వర్లు, కుంచాల రాంబాబు, కురాకుల సుబ్బారెడ్డి, బలరామయ్య పాల్గొన్నారు.


