పొదిలి: మంటలు ఎగిసి కారు దగ్ధమైన సంఘటన మంగళవారం ఒంగోలు–నంద్యాల రోడ్డులో కంభాలపాడు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..కృష్ణాజిల్లా కలిదిండి నుంచి ప్రయాణికులతో కారు కనిగిరి వైపు వెళుతుంది. ఈక్రమంలో కంభాలపాడు బస్టాండ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత కారు ముందుగా వెళులున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారు రేడియేటర్ నుంచి మంటలు వచ్చాయి. దీన్ని గమనించిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే కారు దిగారు. నిముషాల వ్యవధిలో కారు ముందు భాగం మొత్తం దగ్ధమైంది. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. అదృష్టవశాత్తూ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
నిద్రమత్తులో డివైడర్ను ఢీకొని..
సింగరాయకొండ: నిద్రమత్తులో కారు డివైడర్ను ఢీకొని తిరగబడటంతో డీజిల్ ట్యాంకు పగిలి మంటలు చెలరేగి కారు తగలబడింది. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో మండల పరిధిలోని జాతీయరహదారి పై ఉన్న విమానాల రన్వే పై జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సురక్షితంగా బయటపడగా అందులో శ్రీనివాసరెడ్డికి స్వల్ప గాయాలు కాగా సుమతికి గాయాలయ్యాయి. పోలీసుల కథంనం ప్రకారం..తిరుపతిలో దర్శనం చేసుకుని తిరుగుప్రయాణంలో హైదరాబాద్లోని బీన్రెడ్డి హిల్స్కు వెళుతుండగా కారు రన్వే పైకి రాగానే నిద్రమత్తు కారణంగా రోడ్డు మధ్యలో డివైడర్ దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు తిరగబడటంతో పాటు డీజిల్ ట్యాంకు లీకై మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో కారులోని వారు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయట పడ్డారు. తరువాత టంగుటూరు నుంచి ఫైర్ ఇంజన్ మంటలు ఆర్పింది. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. కారులోని వారిని 108లో ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు.


