మాజీ మంత్రి, సంతనూతలపాడు వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026
నాగులుప్పలపాడు/ఒంగోలు సబర్బన్: కనపర్తి ఎత్తిపోతల పథకం కింద సాగు చేసి రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా వెంటనే కొనుగోలు చేయాలని సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలస్యంగా ఏర్పాటు చేయడంతో పాటు రోజుకు కనీసం ఒక్క లారీ ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో కనపర్తి ఎత్తిపోతల పథకం కింద వరి ధాన్యం పండించి రైతులు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం రాశులను సోమవారం మేరుగు నాగార్జున పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతిలో మోసపోతున్న తీరును రైతులు నాగార్జున దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఎత్తిపోతల పథకం కింద 5 గ్రామాల్లో ఉన్న రైతాంగం సుమారు 5 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశామని, పంట చేతికొచ్చే సమయానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుండా తాత్సారం చేసిందన్నారు. దీంతో చాలా మంది రైతులు దళారులకు బస్తా రూ.1000, రూ.1100 లకు అమ్ముకున్నారని తెలిపారు. చివరలో ఏదో మొక్కుబడిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా రోజుకి కనీసం ఒక్క లారీ కూడా రైతుల వద్ద నుంచి సరుకు ఎత్తడం లేదని వాపోయారు.
జేసీకి వినతిపత్రం:
రైతుల బాధలు విన్న మేరుగు నాగార్జున వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను విన్నవించడమే కాకుండా నేరుగా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారిని కలిసి రైతుల పక్షాన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఆరుగాలం చాకిరీ చేసి కష్టపడి పండించిన పంటను దళారులకు నిలువునా అమ్ముకుంటున్న రైతాంగం పట్ల ఈ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. కనపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా రోజుకు 10 లారీల ధాన్యం కొనుగోలు చేస్తే కానీ రైతుల వద్ద సరుకు నాణ్యత లోపించకుండా ఉంటుందని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా నేరుగా కొనుగోలు చేసినట్లుగా ప్రస్తుత ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేస్తేనే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అలా కొనకపోతే రైతాంగం తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారు బాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, పార్టీ మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, పార్టీ నాయకులు వాకా అరుణ కోటిరెడ్డి, కాకర్ల వెంకటేష్, నారపరెడ్డి, కుక్కల గోపాల్ రెడ్డి, పాకనాటి సుందర రామిరెడ్డి, నారపురెడ్డి, ఎస్.ముత్యాల్ రెడ్డి, శ్రీహరి, అంజిరెడ్డి, శివారెడ్డి, నాగిరెడ్డి, పి.జోగారెడ్డి, కే.శ్రీనివాస రెడ్డి, సోమిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.


