కార్మికనగర్ వాసుల
ఒంగోలు సబర్బన్: కార్మిక నగర్ బాధితులను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, వారి కష్టాలు తీర్చాలని వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ప్రకాశం భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిని కార్మిక నగర్ బాధితులతో వచ్చి కలిశారు. ఈ సంధర్భంగా జాయింట్ కలెక్టర్కు కార్మిక నగర్ వాసులు గోడు వెల్లడించారు. చుండూరు రవిబాబు మాట్లాడుతూ సుమారు 70 నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రతినిధులు కార్మిక నగర్లో పర్యటించి భాదితులతో మాట్లాడి వారి గోడును ఆలకించామని, ఇటువంటి అన్యాయం ఒంగోలు చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. గత 15–20 సంవత్సరాలుగా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 186లో సుమారు 4.40 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కార్మిక నగర్లోని పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. కార్మిక నగర్లో ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఆ భూమి ‘ఇనాం’ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో (ఆర్ఎస్ ఆర్) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే కొంతమందికి రెవెన్యూశాఖ వారు ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చారు. కొంత మంది ప్రైవేటు వ్యక్తులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అర్ధరాత్రి వేళ జేసీబీలతో వచ్చి కార్మిక నగర్లోని నిరుపేదల ఇళ్లను కూల్చివేయడం అత్యంత దారుణమన్నారు. కనీసం ఇంట్లోని వస్తువులు కూడా తీసుకునే అవకాశం ఇవ్వకుండా విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రైవేట్ వ్యక్తులు ఏ అధికారంతో, ఏ రికార్డులతో ఆ భూమి తమదేనని పేదల ఇళ్లను కూల్చివేశారో విచారించాల్సిన అవసరం ఉందన్నారు. నిజంగా ప్రైవేటు వ్యక్తుల భూమి ఉంటే వారు ముందుగా కొలతలు వేసుకొని, చట్ట ప్రకారం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవచ్చు కదా అన్ని ప్రశ్నించారు. కానీ అందరి పేదల ఇళ్లు పడేసి వారి జీవనానికి, వారి హక్కులకు భంగం కలిగించారన్నారు. గత 45 రోజులుగా బాధితులు ఆరుబయట ఎండలో, రాత్ర చలిలో, దోమలతో గడుపుతున్నారు. ఈనాటికీ కనీసం రెవెన్యూవారు కానీ, మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ముందుగా కార్మిక నగర్ బాధితులకు తాత్కాలిక నివాసాలు కల్పించాలని జేసీకి విన్నవించారు. ఇళ్లు కోల్పోయిన దానికి నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.
బాధితులకు శాశ్వత నివాస పట్టాలు మంజూరు చేయాలి
ఇళ్లు కూల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
జేసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు


