కొండపి:
చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మారంరెడ్డి గంగాధర్రెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేసిందన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిన వెంటనే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేసినట్లు ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్ల తర్వాత ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ పేరిట పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని, అక్కడ ప్రకటించిన 10060 ఉద్యోగాలు కూడా ఒక్క నోటిఫికేషన్తో ఇవ్వడం లేదని నాలుగు విడతల్లో 41 నోటిఫికేషన్లతో వచ్చే అక్టోబర్ వరకు సాగదీస్తున్నారని విమర్శించారు. వలంటీర్లను తొలగించి వారి పొట్ట కొట్టారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని, ప్రజలను వంచించి మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఖాళీ పోస్టులు 1,72,000 ఉండగా కేవలం 10 వేల పోస్టులు మాత్రమే విడుదల చేశారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ హయాంలో లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారని గుర్తు చేశారు. 66 లక్షల మంది వలంటీర్లకు ఉపాధి కల్పించారన్నారు. కార్యక్రమంలో కొండపి మండల కన్వీనర్ బచ్చల కోటేశ్వరరావు, టంగుటూరు మండల కన్వీనర్ చింతపల్లి హరిబాబు, మర్రిపూడి మండల కన్వీనర్ సుబ్బారెడ్డి, హరీష్ వరుణ్, రవీందర్రెడ్డి, వెంకారెడ్డి, మండల సీనియర్ నాయకులు బొక్కిసం సుబ్బారావు, గొట్టిపాటి మురళి, మండవ మాలకొండయ్య, మేదరమెట్ల భరత్, మల్లికార్జున, బ్రహ్మారెడ్డి ఈశ్వర్, యామవరపు వీర వసంతరావు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, షేక్ వన్నూరు, వంశీ, శ్రీకాంత్రెడ్డి, శ్రీహరిబాబు, నజీర్, నాగేశ్వరరావు, పెట్లూరు కృష్ణమూర్తి, గర్నిపూడి రమేష్, పర్చూరి సుబ్బయ్య, సుల్తాన్, కొర్నేలు, సాంబశివరావు, చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు.


