ప్రభుత్వం పునరాలోచించాలి
మార్కాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల విషయంలో మార్కాపురం ప్రాంత ప్రజల అభిప్రాయాలను గౌరవించి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకుని ప్రభుత్వమే కాలేజీ నిర్వహించాలని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో మార్కాపురంలోని గడియార స్తంభం వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అన్నా రాంబాబుతో పాటు సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డ అంజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అన్నా రాంబాబు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగం వారు పాల్గొనడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తూ విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ ప్రకాశం ప్రజలు కూడా ఈ విషయంలో పార్టీలకు అతీతంగా ఆలోచించి వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని అన్నారు. ప్రైవేటీకరణ చేస్తే వైద్యంతోపాటు వైద్య విద్య కూడా పేద, బడుగు, బలహీనవర్గాల అందదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రారంభించి నిర్మించ తలపెట్టిన మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించేలా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు డి.అంజిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా ప్రతినిధులు కేసులకు భయపడాల్సిన పనిలేదని, వచ్చేది మన ప్రభుత్వమేనని, పార్టీ అండగా ఉంటుందని అన్నారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు జగనన్న చేసిన మేలును వివరించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు వెన్న శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సోషల్ మీడియా బలోపేతంగా ఉండాలని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో వైద్య కళాశాలలు ఒక్కటి కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో 5 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయగా, ఆయన తనయుడు ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడంతో ఆయనకు ఎక్కడ మంచిపేరు వస్తుందోననే అక్కసుతో పీపీపీ విధానానికి చంద్రబాబు మొగ్గుచూపుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, సోషల్ మీడియా అధికార ప్రతినిధి నవీన్ కృష్ణారెడ్డి, రాజబాలవర్దన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీమ్, గాయం శ్రీనివాసరెడ్డి, సోషల్ మీడియా రఫీ, బొగ్గరపు శేషయ్య, ఎస్ఎన్ పాడు సోషల్ మీడియా అధ్యక్షురాలు ఝాన్సీ, గిద్దలూరు అధ్యక్షుడు శివారెడ్డి, యర్రగొండపాలెం అధ్యక్షుడు శ్యామ్, కొండపి అధ్యక్షుడు పెద్దిరెడ్డి బ్రహ్మారెడ్డి, తారకసాయి, కుందురు శ్రీనివాసరెడ్డి, రమేష్, చల్లా వెంకటరామిరెడ్డి, కొండారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, స్థానిక కౌన్సిలర్లతో పాటు గొలమారి సత్యనారాయయరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా సోషల్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం పాత బస్టాండులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలల విషయంలో
ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి
ప్రభుత్వమే నిర్వహించాలి
వైఎస్సార్ సీపీ మార్కాపురం
నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు


