
కార్యకర్తల వెన్నంటే ఉంటాం
● వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ
● అక్రమ కేసుల్లో అరెస్టయిన కార్యకర్తలకు పరామర్శ
పొదిలి: కూటమి నేతలు అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు వెన్నంటి అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి భరోసా ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో, వైద్యశాలలో, కోర్టు వద్ద అరెస్ట్ అయిన కార్యకర్తలను వారు పరామర్శించారు. అరెస్ట్ చేసిన ప్రతి కార్యకర్త వివరాలను, కుటుంబ పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఇంటి వద్ద తల్లిదండ్రులు, భార్యా పిల్లలు ధైర్యంగా ఉండాలని చెప్పారు. అరెస్ట్ అయిన కార్యకర్తలకు సంబంధించి గ్రామాల్లో మిగిలిన నాయకులు, కార్యకర్తలు వారి కుటుంబాలకు అండగా ఉండి, ధైర్యం చెప్పాలన్నారు. లీగల్ టీమ్ సభ్యులతో తాము అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, వారి కేసులు తేలేంత వరకు లీగల్ టీం పనిచేస్తుందని చెప్పారు. కార్యకర్తల కుటుంబాలకు కూడా తాము అండగా ఉంటామని చెప్పారు. కార్యకర్తలకు లీగల్ టీం ద్వారా న్యాయ సహాయం అందేలా చేస్తామన్నారు. అరెస్ట్ అయిన కొందరి వివరాలు తీసుకుని వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఎటువంటి సమస్య వచ్చినా తాము నిత్యం అందుబాటులో ఉంటామని వారు చెప్పారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ అక్రమంగా కేసులు నమోదు చేయటం ద్వారా, జగన్మోహన్రెడ్డి పోరుబాట కార్యక్రమం సూపర్ సక్సెస్ కావటంతో ఓర్చుకోలేక పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. చివరికి న్యాయం గెలుస్తుందని అన్నారు. తాము ఎప్పటికప్పుడు చర్చించుకుని ఐక్యంగా కార్యకర్తల కోసం పనిచేస్తామని చెప్పారు. కార్యకర్తలను పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ.రమణారెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కొనకనమిట్ల ఎంపీపీ మోరబోయిన మురళి, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, తర్లుపాడు అధ్యక్షుడు మురారి వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు షేక్.మస్తాన్వలి, శ్రీధర్రెడ్డి, శింగారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదనరెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.

కార్యకర్తల వెన్నంటే ఉంటాం