
హైలెస్సో.. హైలెస్సా
ఒంగోలు సబర్బన్:
సముద్రంలో చేపల వేటకు వేళయింది. ప్రభుత్వం విధించిన చేపల వేట నిషేధం శనివారంతో ముగిసింది. దాంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే బోట్లు, వలలు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకున్నారు. 61 రోజులుగా చేపల వేట నిషేధంతో బోసిపోయిన సముద్ర తీరం నేటి నుంచి మళ్లీ సందడిగా మారనుంది. గతేడాది మత్స్యకారులకు సముద్రంలో చేపల వేట కలిసిరాలేదు. 2024 జూన్లో వేట మొదలుపెట్టిన వెంటనే వరుసగా తుఫాన్లు, అల్పపీడనాలతో సముద్రంలోకి వెళ్లిన బోట్లు ఒకటీరెండు రోజులు కూడా వేట సాగించకుండానే తీరానికి చేరాల్సి వచ్చింది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాకుండా మత్స్యకారులు నష్టాలు చవిచూశారు. దీనికితోడు గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఆ ఏడాది వేట నిషేధ సాయం అందించలేదు. దాంతో మత్స్యకారులు అప్పులపాలయ్యారు. నిషేధం అనంతరం రెండు నెలల పాటు సముద్రంలో అపారంగా మత్స్య సంపద దొరుకుతుందని మత్స్యకారులు నమ్ముతారు. ఈ ఏడాదైనా ప్రకృతి కరుణించాలని గంగపుత్రులు వేడుకుంటున్నారు. బంగాళాఖాతంలో మత్స్య సంతతి వృద్ధి చెందేందుకు వీలుగా ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి చేపల వేటపై నిషేధం అమలు చేశారు. మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లు, మోటారు బోట్లతో సముద్రంలో చేపల వేటకు వెళ్లడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ వేట నిషేధం ముగిసింది. మాంసాహార ప్రియులు లొట్టలేసుకుని తినే సముద్ర చేపలు, రొయ్యలు, పీతల రుచులను మళ్లీ ఆస్వాదించనున్నారు.
2025–26 వేట నిషేధ భృతి ఇలా...
జిల్లాలో 50 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఐదు మండలాల పరిధిలో 14,500 మత్స్యకార కుటుంబాలున్నాయి. జిల్లాలోని నాగులుప్పలపాడు, ఒంగోలు, కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో మొత్తం 35 వేలకుపైగా మత్స్యకార జనాభా ఉన్నారు. మత్స్యకార గ్రామాల్లో మొత్తం 7,285 మంది మత్స్యకారులు చేపల వేట వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లేందుకు ఉపయోగించే మోటరైజ్డ్ బోట్లు 1,105 ఉన్నాయి. నాన్ మోటరైజ్డ్ బోట్లు 230 ఉన్నాయి. వాస్తవానికి 7,285 మంది సముద్రంలో వేట సాగించే మత్స్యకారులు ఉన్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం గుర్తించింది. లేనిపోని సాకులు చూపి 1,784 మంది లబ్ధిదారులకు మత్స్యకార భృతి ఎగ్గొట్టి కేవలం 5,501 మందికి మాత్రమే రూ.20 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది.
నేటి నుంచి సముద్రంలో చేపల వేట ప్రారంభం
ఇప్పటికే వలలు, బోట్లు సిద్ధం చేసుకున్న మత్స్యకారులు
61 రోజులుగా వేట నిషేధంతో బోసిపోయిన సముద్రతీరం
మళ్లీ సందడిగా మారనున్న తీరప్రాంతం
గతేడాది వేట నిషేధ భృతికి ఎగనామం పెట్టిన కూటమి సర్కార్
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 5,452 మందికి వేట నిషేధ భృతి అందజేత
ఈ ఏడాది నిబంధనల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించిన చంద్రబాబు ప్రభుత్వం
7,285 మంది లబ్ధిదారులు ఉంటే.. కేవలం 5,501 మందికి మాత్రమే భృతి
గతేడాది వేట నిషేధ భృతికి ఎగనామం...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది వేట నిషేధ భృతికి ఎగనామం పెట్టింది. 2023–24లో వేట నిషేధ భృతి కింద తీరప్రాంతాల్లో 5,452 మంది మత్స్యకారులను అర్హులుగా ప్రతిపాదించారు. వేట నిషేధ భృతి కింద లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.10 వేల చొప్పున నేరుగా రూ.5.45 కోట్లు జమ చేశారు. 2024–25 వేట నిషేధ భృతి కింద 5,452 మంది మత్స్యకారులను గుర్తించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాల్సిన రూ.5.45 కోట్లు జమచేయకుండా ఎగనామం పెట్టింది. గతేడాది ఎన్నికల కోడ్ రావడంతో భృతి అందలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు వేట నిషేధ భృతి రూ.20 వేలు ఇస్తామంటూ హామీ ఇచ్చింది. అయితే, గతేడాది ఇవ్వాల్సిన బకాయిలకు మొండిచేయి చూపింది.

హైలెస్సో.. హైలెస్సా