
హైస్కూల్కు ఎగనామం
తల్లికి వందనం
బేస్తవారిపేట: తల్లికి వందనం పథకం అమలు తీరులో సర్కారు డొల్లతనాన్ని బట్టబయలు చేసిన సంఘటన బేస్తవారిపేట మండలంలోని పిటికాయగుళ్లలో వెలుగుచేసింది. హాజరు శాతం, ఇతర కారణాలతో ఇప్పటికే విద్యార్థుల సంఖ్యను కుదించేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం బేస్తవారిపేట మండలంలో ఏకంగా ఓ పాఠశాలనే తల్లికి వందనం పథకానికి దూరం చేయడం సంచలనం సృష్టించింది. పిటికాయగుళ్ల జెడ్పీ హైస్కూల్లో మూడో తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 134 మంది ఉన్నారు. పిటికాయగుళ్ల సచివాలయం పరిధిలోని ప్రాథమిక పాఠశాల, బయటి ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్, ఇన్ ఎలిజిబుల్ జాబితాలు వచ్చాయి. ఈ జాబితాలో హైస్కూల్లో చదువుతున్న 134 మంది విద్యార్థుల వివరాలు లేవు. జాబితాను సరిచూసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హైస్కూల్ హెచ్ఎం భాస్కరరావు ప్రశ్నించారు. మాకు ఏమీ తెలియదు, పైనుంచే జాబితాలను సచివాలయాలకు పంపారని, తాము ఎటువంటి జాబితాను పంపలేదన్నారు. బేస్తవారిపేటలోని ఎంఈఓ సీహెచ్ రమణారెడ్డికి విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యను తెలిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.