తాడేపల్లి : జగనన్న కాలనీలపై ఎల్లీ మీడియా తప్పుడు ప్రచారం చేయడంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. జగన్ 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇస్తే ఎల్లో మీడియా వాటిపై విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఒక్కరికి కూడా స్థలం ఇవ్వలేదని విమర్శించారు.
ఈరోజు(గురువారం, ఏప్రిల్ 30వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జోగి రమేష్.. స్థలాలు ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించకుండా జగన్పై రోత రాతలు ఎందుకని నిలదీశారు. జగన్ 31 లక్షల మందికి స్థలాలు ఇచ్చి.. కోటి మందికి నివాసం కల్పించారన్నారు.
చంద్రబాబు 16 సంవత్సరాలు సీఎంగా చేసినా ఒక్క కాలనీ కూడా కట్టించలేదు. 17,005 జగనన్న కాలనీలను ఏర్పాటు చేసిన గొప్ప ప్రభుత్వం జగన్ది.చంద్రబాబు, లోకేష్, ఎల్లో మీడియా ఎవరొచ్చినా వాటిని చూపిస్తాం. కొత్తగా ఊర్లనే ఏర్పాటు చేశాం.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా నేటికీ ఒక్క సెంటు స్థలం ఇచ్చారా?, ఇళ్ల స్థలాలు ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించని ఎల్లో మీడియాకు జగన్ విమర్శించే అర్హత ఉందా?, జగనన్న కాలనీల్లో కనీసం నీటి సౌకర్యం కూడా కల్పించకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. జగన్ కట్టించిన ఇళ్లను చంద్రబాబు ఓపెన్ చేసి ఫోటోలు దిగారు. జగన్ క్రెడిట్ని చంద్రబాబు చోరీ చేస్తున్నారు’ అని విమర్శించారు.


