టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్‌సీపీ ఫైర్ | YSRCP Fires On TDP Leaders Behaviour And Style Of Dealing, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్‌సీపీ ఫైర్

Aug 20 2025 9:17 PM | Updated on Aug 21 2025 10:34 AM

Ysrcp Fires On Tdp Leaders Behaviour And Style Of Dealing

సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. జాతీయ మీడియాను ట్యాగ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ట్వీట్ చేసింది. గత కొన్ని రోజుల్లోనే టీడీపీ పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవర్తన దారుణంగా తయారైంది. దీంతో ప్రభుత్వ విశ్వసనీయత, పాలన మీద తీవ్ర అనుమానాలు పెరుగుతున్నాయంటూ ఎక్స్‌ వేదిక  వైఎస్సార్‌సీపీ పేర్కొంది.

‘‘అధికారుల మీద దాడి చేయడం నుంచి అవినీతి, పెరోల్ స్కాం, మహిళలపై అసభ్య ప్రవర్తన వరకు అనేక దారుణాలకు ఒడిగట్టారు. శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మద్యం మత్తులో అటవీ అధికారుల మీద దాడి చేశారు. వారి గస్తీ విధులను అడ్డుకున్నారు. గిరిజన సిబ్బందిని కూడా వేధించారు. ఈ ఘటనపై కనీసం అధికారులు కేసు కూడా నమోదు చేయలేదు. మంత్రి అచ్చెన్నాయుడు  వైఖరితో ఆగ్రోస్ జనరల్ మేనేజర్ మోహన్ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. డీలర్ల నుండి కమీషన్లు గుంజుకునే విషయంలో సహకరించలేదని ఆయన్ను వేధించి బదిలీ చేశారు.

..నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఒక రౌడీషీటర్‌కి పెరోల్ సిఫార్సు చేశారు. దీనికి హోం మంత్రి అనిత కూడా పూర్తిగా సహకరించారు. వీరి చర్యలను చూస్తే ప్రజల భద్రత కంటే నేరస్తుల ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఉంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్‌లో మహిళతో అసభ్యకరంగా వ్యవహరించారు. ఆ విషయం బయట పెట్టిందని అనుమానించి మరో మహిళను వేధించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.

..అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను రాత్రిళ్లు ఆఫీస్‌కి పిలిపించడం, అర్థరాత్రి వీడియో కాల్స్ చేయడం వంటి వేధింపులకు పాల్పడ్డారు. దాంతో ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. మూడునాలుగు రోజుల్లోనే ఈ ఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏస్థాయిలో అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అధికారులపై దాడులు, మహిళలపై అసభ్య ప్రవర్తన వంటి ఆరోపణలు రావడం సిగ్గుచేటు. టీడీపి ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళల గౌరవాన్ని కాలరాస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని తుంగలో తొక్కారు’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ నిలదీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement