బీజేపీది రెండు నాల్కల వైఖరి: మమత

West Bengal Chief Minister Mamata Banerjee criticisms on bjp - Sakshi

షిల్లాంగ్‌: రాష్ట్రాలకు చెల్లించాల్సిన నిధులు, ఇతరత్రా హామీలను ఎన్నికల వేళ ప్రధానంగా ప్రస్తావించే బీజేపీ ఆ తర్వాత మరోలా మాట్లాడుతుందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. మేఘాలయలోని ఉత్తర గారో హిల్స్‌ జిల్లాలో బుధవారం ఆమె భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘బీజేపీకి రెండు ముఖాలుంటాయి. ఎన్నికల ముందు హామీలు గుప్పిస్తూ ఒక ముఖం మాట్లాడుతుంది. ఆ తర్వాత మరో ముఖం మరోలా మాట్లాడుతుంది.

కాషాయ పార్టీ ఏలుబడిలోని రాష్ట్రాలకే కేంద్ర నిధులు దక్కుతాయి. ఇలాంటి పార్టీకి ఓటేయకండి’’ అని పిలుపునిచ్చారు. అస్సాం, త్రిపురలతోపాటు మేఘాలయలోనూ పార్టీని పటిష్టంచేయడంపై మమత దృష్టిసారించారు. మేఘాలయలో 2021 నవంబర్‌లో కాంగ్రెస్‌లోని 17 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 12 మంది టీఎంసీలో చేరడం విశేషం! గత డిసెంబర్‌లో రాష్ట్రంలో పర్యటించిన మమత.. స్థానిక మహిళలకు ఆర్థిక తోడ్పాటు కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. ఈ కొద్దిరోజుల్లోనే 3.14 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top