ఈడీ నోటీసులు.. సంబంధం లేదన్న గంగుల | TS Minister Gangula Kamalakar Reacts On ED Notices - Sakshi
Sakshi News home page

ఈడీ నోటీసులు.. తనకు సంబంధం లేదన్న మంత్రి గంగుల

Sep 6 2023 7:43 AM | Updated on Sep 6 2023 9:05 AM

TS Minister Gangula Kamalakar Reacts ED Notices - Sakshi

నోటీసులు అందుకున్న శ్వేతా ఏజెన్సీతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి.. 

సాక్షి, కరీంనగర్‌: తన కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు అందించిందన్న పరిణామంపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు. తనకు నోటీసులేవీ రాలేదని.. నోటీసులు అందుకున్నట్లుగా చెబుతున్న శ్వేతా గ్రానైట్స్‌తో తనకేలాంటి సంబంధం లేదని అంటున్నారాయన. 

గంగుల కుటుంబ సభ్యుల కు చెందిన శ్వేతా గ్రానైట్స్‌ విదేశాలకు ఎగుమతుల విష యంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ అంశంపై ఈడీ వివరణ కోరినట్లు తెలియవచ్చింది. గతేడాది నవంబర్‌లో శ్వేతా గ్రానైట్స్‌ సంస్థలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం తెలిసిందే. చైనాకు గ్రానైట్‌ ఎగుమతుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ. 4.8 కోట్ల మేర ఫెమా నిబంధనల ఉల్లంఘనతోపాటు ప్రభుత్వానికి రూ. 50 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 3 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు ఈ అంశంపై మంత్రి గంగుల మంగళవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఈడీకి సంబంధించి తనకు నోటీసులేవీ రాలేదని, శ్వేతా గ్రానైట్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారమే శ్వేతా గ్రానైట్స్‌ లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. శ్వేతా గ్రానైట్స్‌కు ఈడీ నోటీసులనేవి 2008 నుంచి కొనసాగుతున్నవేనన్నారు. ఈ విషయంలో ఆ సంస్థ వ్యాపారం గురించి లేదా తన గురించి ఈడీకి ఎలాంటి సమాచారమైనా ఇస్తానని, పూర్తిగా సహకరిస్తానని మంత్రి సమాధానమిచ్చారు. 

ఇదీ చదవండి: ప్రసవాల్లో రికార్డు

Advertisement
 
Advertisement
Advertisement