రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ గతి తప్పింది: హరీశ్‌రావు | TG Ex Minister harish Rao Reacts On Serial Incidents About Law And Order | Sakshi
Sakshi News home page

వరుస ఘటనలు.. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ గతి తప్పింది: హరీశ్‌రావు

Jun 19 2024 1:39 PM | Updated on Jun 19 2024 1:55 PM

TG Ex Minister harish Rao Reacts On Serial Incidents About Law And Order

హైదరాబాద్‌, సాక్షి: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. అందుకు వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనమని మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్‌ వేదికగా స్పందించారు.  

‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనం. గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. 

.. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరచిపోక ముందే, మరో దారుణం చోటుచేసుకున్నది. రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిస్టేబుల్ ను భక్షంచే దుర్ఘటన నిన్న భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సై పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 

.. గత పదేళ్ళలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్ధకమవటం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని కోరుతున్నాం అని ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారాయన. 

భట్టి కౌంటర్
హరీష్‌రావు చేసిన ట్వీట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ‘‘గత పదేళ్ళ పాలనను హరీష్ రావు మర్చిపోయారా?. బీఆర్ఎస్ ప్రభుత్వం లో జరిగిన సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది’’ అని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్న మంత్రి భట్టి.. అవాంఛనీయ సంఘటనలకు పాల్డడే వ్యక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement