
లోక్సభ ఎన్నికల తర్వాత నేను సీఎం అన్నది ఊహాజనితమే: పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
సీఎం వెంట ఉన్నంత మాత్రాన నంబర్ 2 ఎలా అవుతానని ప్రశ్న
వచ్చే ఐదేళ్లూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల తర్వాత తాను సీఎం అవుతానంటూ జరుగుతున్న ప్రచారం ఊహాజనితమేనని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కావాలని తానేమీ కోరుకోవడం లేదన్నారు. తాను బీజేపీతో టచ్లోకి వెళ్లినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ప్రధాన మంత్రిని కలిసినంత మాత్రాన పొల్యూట్ అయినట్టు కాదన్నారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లూ కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని చెప్పారు.
గురువారం మంత్రి పొంగులేటి హైదరాబాద్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పొంగులేటి సీఎం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని మీడియా ప్రస్తావించగా.. అంతా అవాస్తవన్నారు. ‘‘పళ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు పడతాయి. నా వద్ద పళ్లు ఉన్నాయి. అందుకే ఈ ప్రచారం జరుగుతోంది. నేను సీఎం వెంట ఉన్నంత మాత్రాన కేబినెట్లో నంబర్ 2 ఎలా అవుతాను. సీఎం కావాలని నేను అనుకున్నా పార్టీ అధిష్టానం అన్నిరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది కదా..’’అని పేర్కొన్నారు.
ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయబోం..
గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ ట్యాపింగ్ చేయదని భరోసా ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు సాధిస్తుందన్నారు. బీఆర్ఎస్ ఒకట్రెండు సీట్లు గెలిస్తే గొప్పేనన్నారు. కాంగ్రెస్లోకి ఎవరినీ ఆహా్వనించలేదని, వారంతట వారే వస్తున్నారని చెప్పారు.
బీఆర్ఎస్పై కేసులతో కక్షసాధింపు అన్న ఆరోపణలు సరికాదని.. గత ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడేనాటికే వానాకాలం ముగిసిందని.. కానీ జలాశయాల్లో నీళ్లు లేకపోవడం, పంటలు ఎండిపోవడం విషయంలో తమ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. జీతాల చెల్లింపులో కొంత ఆలస్యం వాస్తవమేనని, దానిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.