బెంగళూరులో తెలంగాణ దంపతులు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగం కోల్పోవడం, వరుస ఆర్థిక ఇబ్బందుల వల్ల దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు.
తెలంగాణకు చెందిన టెకీ బాను చందర్రెడ్డి (32) బెంగళూరులో తన అపార్ట్మెంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది సేపటికే ఆయన భార్య, ఐబీఎంలో పనిచేస్తున్న బిబి షాజియా సిరాజ్ 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లాకు చెందిన బాను చందర్రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో పనిచేసేవారు. అయితే గతేడాది ఏఐ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయారు. దీంతో భార్య షాజియాతో కలిసి భారత్కు తిరిగి వచ్చి బెంగళూరులో స్థిరపడ్డారు. దాదాపు ఏడాది కాలంగా ప్రయత్నాలు చేసినా స్థిరమైన ఉద్యోగం దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాబ్ మార్కెట్లో ఏఐ ఆధారిత మార్పులు, ఉద్యోగాల కోతల కారణంగా అవకాశాలు తగ్గిపోవడంతో ఆయన ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.
మరోవైపు, షాజియాతో మతాంతర వివాహం జరగడం వల్ల బాను చందర్రెడ్డిని అతని కుటుంబ సభ్యులు దూరం పెట్టారు. ముఖ్యంగా తండ్రి వ్యతిరేకత వ్యక్తం చేయడంతో బాను చందర్ కుంగిపోయాడు. ఓ వైపు కుటుంబసభ్యులు దూరం పెట్టడం, ఆర్ధిక ఇబ్బందులతో ఒత్తిడికి గురైన బాను చందర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని షాజియా తీవ్ర షాక్కు గురై 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో, తన మరణానికి భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించవద్దని బాను చందర్రెడ్డి పేర్కొన్నారు.
ఈ ఘటన టెక్ రంగంలో ఏఐ ప్రభావం, ఉద్యోగ భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. నిరుద్యోగం, కుటుంబ విభేదాలు, మానసిక ఒత్తిడి కలిసినప్పుడు ఎంతటి విషాద పరిణామాలు చోటు చేసుకోవచ్చో మరోసారి స్పష్టమైంది.


