
సాక్షి,హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని ఆమె ఎద్దెవా చేశారు.
మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని సీఎం ప్రకటిస్తారని మహిళలకు ఆశించారు. కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేస్తారని ఊహించారు. కానీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయడం లేదు. రాష్ట్రంలోని ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం రూ. 30 వేలు బాకీ పడింది. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు. తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని కవిత డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 40 శాతం నేరాలు పెరిగాయి. నేరాల పెరుగుదల.. ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసే సోయి ప్రభుత్వానికి లేదు. మహిళలు చూస్తూ ఊరుకోబోరు.. కచ్చితంగా ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొట్టింది. తక్షణమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలి. రైతు భరోసా కింద అర్హులను తగ్గించే ప్రయత్నం చేయవద్దు. కేంద్ర ప్రభుత్వపు నిబంధలను అమలు చేస్తే 30 శాతం రైతులకు కూడా రైతు భరోసా రాదని కవిత పేర్కొన్నారు.