బీఆర్‌ఎస్‌కు కోమటిరెడ్డి సవాల్‌.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా? | Minister Komati Reddy Venkat Reddy Open Challenge To BRS Leaders | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు కోమటిరెడ్డి సవాల్‌.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?

Oct 1 2024 2:59 PM | Updated on Oct 1 2024 4:29 PM

Minister Komati Reddy Venkat Reddy Open Challenge To BRS Leaders

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రతిపక్షాలకు మానవత్వం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీ నది విషయంలో ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని బీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు. తెలంగాణను పది సంవత్సరాలు పాలించి బీఆర్‌ఎస్‌ నేతలు దోచుకున్నారని ఘాగు విమర్శలు చేశారు.

మంత్రి కోమటిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మూసీలో పారేది విషపు నీరు. తెలంగాణ వచ్చాక మూసీ స్థితి మారుతుందని అనుకున్నాం. మూసీ కోసం కేటీఆర్‌ వెయ్యి కోట్లు అప్పు తెచ్చారు. మూసీ డెవలప్మెంట్ బోర్డు అన్నావ్ కదా ఏమైంది?. గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాళ్లు మూసీ పక్కన ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. లక్షల కోట్లు సంపాదించుకున్నావు కాదా.. పేదలపై కొంచెం కూడా జాలి లేదా?. మూసీ ప్రక్షాళన చేస్తే కమీషన్ రాదని మొదలు పెట్టలేదా?. మూసీని ప్యూరిఫైర్ రివర్‌గా మార్చాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది.

ప్రతిపక్షాలకు కనీసం మానవత్వం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ వచ్చి మూసీ ప్రక్షాళనపై మాట్లాడాలి. కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకులు కాదు. కాళేశ్వరం ఒక తుగ్లక్ పని. మల్లన్న సాగర్ నిర్వాసితులను గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో చూశాం. మూసీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆర్ దగ్గర ఓఎస్‌డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్‌ను అడగండి. మల్లన్న సాగర్ నిర్వాసితులను పోలీసులతో ఎందుకు కొట్టించారు?.

నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువ. మూసీ ప్రక్షాళనలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. నేను నల్గొండ వ్యక్తిగా, మూసీ బాధితుడిగా మాట్లాడుతున్నాను. మమ్మల్ని చావామంటారా?. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ వాళ్లు గోదావరి జలాలతో సంతోషంగా ఉండాలి. మేము మాత్రం నల్గొండ మూసీ మురికితో చావాలా?. మూసీ నీళ్లను అమెరికా తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. నల్గొండ వచ్చినా, వయా నల్గొండ వెళ్ళినా అక్కడి ప్రజలు ప్రతిపక్ష నేతలకు బుద్ధి చెప్తారు. జిల్లా పరిషత్ బడుల్లో చదివిన మాకే ఇంత తెలివి ఉంది. అమెరికాలో చదువుకున్న అని చెప్పుకుంటున్న నీకు తెలివి ఏమైంది?. నల్గొండలో మీ బంధువులు లేరా?. నల్గొండపై ఎందుకు కక్ష కట్టారు?.

బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ చేస్తున్నా.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?. బస్సు పెడతాను, నేను మీతో పాటే వస్తాను. ప్రజలు ఏం చేస్తారో మీరే చూడండి. నేను 25ఏళ్ల కింద మూసీ నది కోసం దీక్ష చేశాను. జయశంకర్‌ అప్పుడు నాకు మద్దతు తెలిపారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు రెచ్చగొడుతున్నారు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: బుల్డోజర్‌ను బొం‍ద పెట్టండి: మూసీ నిర్వాసితులతో కేటీఆర్‌

Advertisement
 
Advertisement
Advertisement