పెగసస్‌ స్పైవేర్‌ను కొన్న చంద్రబాబు సర్కార్‌: మమతా బెనర్జీ

Mamta Banerjee claim that the previous Chandrababu Naidu government purchased the Pegasus Spyware - Sakshi

బెంగాల్‌ సీఎం మమత వెల్లడి

కోల్‌కతా: వివాదాస్పద పెగసస్‌ స్పైవేర్‌ను నాలుగైదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయన్నారు. అయితే, ఈ అంశం ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించినది, చట్ట విరుద్ధమైంది అయినందున తాము కొనలేదని వెల్లడించారు.

‘ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అమ్ముతామంటూ నాలుగైదేళ్ల క్రితం మా రాష్ట్ర పోలీసులను సంప్రదించింది. విషయం నాకు తెలిసి, మాకు ఆ సాఫ్ట్‌వేర్‌ అవసరం లేదని చెప్పాను’ అని ఆమె వెల్లడించారు. కానీ ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసిన కేంద్రం ప్రభుత్వం, దానిని దేశ భద్రత కోసం ఉపయోగించడానికి బదులుగా రాజకీయ ప్రయోజనాల కోసం జడ్జీలు, ప్రతిపక్షనేతలు, ఇతర అధికారులపై నిఘాకు వాడుకుందని ఆరోపించారు. 2017లో పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను భారత ప్రభుత్వం 2 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్‌టైమ్స్‌లో వచ్చిన కథనం ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top