ఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీలో కలకలం రేపుతోంది. ఆ పార్టీలో చీలికలు మొదలయ్యాయని, మైనింగ్ కేసులో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జైలుకెళ్తారంటూ ఆ రాష్ట్ర పంచాయతీ, సంక్షేమ శాఖ మంత్రి ఓపీ ప్రకాష్ రాజ్ భర్ బాంబు పేల్చారు. ఇటీవల మహరాష్ట్ర,పశ్చిమ బెంగాల్కు చెందిన నేతలు సొంత పార్టీలను వీడి అధికార బీజేపీలో చేరేందుకు క్యూకడుతున్నారు.
ఈ క్రమంలో యూపీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ మీడియాతో మాట్లాడారు. త్వరలో సమాజ్ వాదీ పార్టీలో ఒక పెద్ద చీలిక రాబోతోంది. ఇప్పటికే ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మైనింగ్ కేసులో సీబీఐ అఖిలేష్ యాదవ్ పేరు ఉందని త్వరలోనే జైలుకు వెళ్తారు. ఇందులో భాగంగానే ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్గోపాల్ యాదవ్తో పాటు పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయమై రామ్గోపాల్ కేంద్ర హోంమంత్రి అమిత్షాకు లేఖ రాశారు. ఆ లేఖలో పార్టీని వీడి బీజేపీలో చేరే నేతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉందని కూడా చెప్పారని తెలిపారు.
అయితే ఆ లేఖలో పార్టీ మారుతున్న నేతల పేర్లు, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు స్పష్టంగా లేవు. మీడియా ప్రశ్నించగా ఓంప్రకాష్ రాజ్భర్ మాట్లాడుతూ.. ‘ఎస్పీని వీడే నేతల వివరాలు నాకు తెలుసు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అవి అలాగే జరగనివ్వండి. ఇప్పుడు నేను చెప్పితే నాశనం అవుతుంది. మరికొన్ని రోజులు ఆగితే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారు’ అని అన్నారు.
ఇక లేఖపై రామ్గోపాల్ యాదవ్ స్పందిస్తూ.. ‘నేను లేఖ రాశానని మీరంటున్నారు. ఆ లేఖ గురించి అమిత్షాను అడగండి. దేశంలో ఎవరూ ఓం ప్రకాష్ రాజ్భర్ను సీరియస్గా తీసుకోరు. ఆయన ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతుంటారు. అసలు తాను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు’ అని వ్యాఖ్యానించారు. ఆయన అవన్నీ వదంతులేనని, పార్టీలో అంతా సవ్యంగానే ఉందని స్పష్టం చేశారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, సుహుల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓంప్రకాష్ రాజ్భర్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో 19 స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాలు గెలుచుకున్నారు. కొద్ది నెలలకే ఎస్పీకి గుడ్బై చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన యూపీ కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు.
కాగా, మహారాష్ట్ర, బెంగాల్ తర్వాత ఎస్పీ బీజేపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు. ప్రతిపక్షంలో అత్యంత కీలకమైన రెండు పార్టీలు టీఎంసీ, శివసేన(యూటీబీ) పార్లమెంట్ శ్రేణుల నుంచి తిరుగుబాటుతో కుదేలవుతున్న తరుణంలో యూపీ మంత్రి కీలక ప్రకటన సంచలనంగా మారింది.


