సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. క్లాసిక్ గార్డెన్లో బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 25 నుండి సర్ ప్రారంభమవుతుందని.. సర్’పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
‘‘కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు వారానికి మూడు రోజులు పవర్ హాలిడే ఉండేది. 65 సంవత్సరాలలో కాంగ్రెస్ చేయని పని ఆరు నెలల్లో కేసీఆర్ చేసి చూపించారు. 24 గంటల పాటు రైతులకు, పరిశ్రమలకు కేసీఆర్ నాణ్యమైన కరెంటు ఇచ్చారు’’ అని కేటీఆర్ గుర్తు చేశారు.
‘‘వ్యవసాయానికి రోజుకు మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అన్నా రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. 35 వేల ఓటర్లు డిఫెన్స్ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నారు. వారి ఓటు హక్కు ఉండాలంటే సర్లో నమోదు చేసుకోవాలి. హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించారు. గ్రామాల్లో రేవంత్ 420 మోసపూరిత హామీలను నమ్మి కాంగ్రెస్కు ఓట్లు వేశారు. దేశం మొత్తం కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే మనం నెత్తి మీద పెట్టుకున్నాం.
..సుమారు 2 లక్షల పట్టాలు కేసీఆర్ ఇచ్చారు.. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇండ్ల పట్టాలు అయినా రేవంత్ ఇచ్చారా?. స్కూటీ లేదు లూటీ మాత్రం నడుస్తుంది. రైతుబంధు లేదు రాహుల్ బంధు నడుస్తుంది. రైతులకు యూరియా ఇచ్చే దిక్కు లేదు. ధాన్యం కొనే దిక్కు లేదు కానీ.. రైతులకు రైతు డిస్కం తెస్తారంటా?. రైతులకు ఊరి వేయడానికే రైతు డిస్కం తెస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో 95 లక్షల ఓట్లు సర్ పేరుతో తీసేశారు.. కోర్టుకు వెళ్లారు.. కోర్టులో ఉండగానే ఎన్నికలు జరిగాయి బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారు. అందరూ సర్లో పాల్గొని.. మన ఓట్లు తొలగించకుండా మనం అప్రమత్తంగా ఉండాలి’’ అని కేటీఆర్ సూచించారు


