
మనం ఎవరైనా.. ఏదో సందర్భవశాత్తు.. తప్పనిసరైతేనే అబద్దాలు చెబితే చెప్పవచ్చు. కానీ దైవసన్నిధికి వెళ్లినప్పుడు మాత్రం అలా అసత్యాలు చెప్పడానికి వెనుకాడతాం. రాజకీయ నేతలకు ఈ విషయంలో కూడా మినహాయింపే ఉన్నట్లు ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు.. అంతా పవిత్రంగా భావించే తిరుమలను సైతం తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో విపక్షంలో ఉన్నప్పుడు కాని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాని ఆరితేరినట్లు కనబడుతోంది.
కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తన మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు పురస్కరించుకుని తిరుమలకు వెళ్లినప్పుడు ఆయన చెప్పిన విషయాలలో అబద్దాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు, ఆ తర్వాత భూమన వాదన విన్న తర్వాత తిరుమల యాత్ర సందర్భంగా కూడా అబద్దాలు చెబుతున్నారన్న విమర్శలకు సీఎం ఎందుకు ఆస్కారం ఇస్తున్నారనే భావన కలుగుతోంది. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని, దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే నీచత్వం చంద్రబాబు, పవన్లదని భూమన అన్నప్పుడు దానిని ఖండించవలసిన టీడీపీకాని, ప్రభుత్వంలోని వారు కాని అసలు పట్టించుకోలేదంటే దానిపై వివరణ ఇచ్చే పరిస్థితి లేదనే అర్ధం అవుతుంది కదా!.
👉వైఎస్ జగన్(YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి చిన్న అంశాన్ని.. అందులో వాస్తవం ఉన్నా లేకపోయినా గోరంతలు కొండంతలు చేసి తిరుమల అపవిత్రం అయిపోతోందంటూ చంద్రబాబు, పవన్, లోకేష్ ఆరోపణలు గుప్పించేవారు. వాటిలో అత్యధికం అసత్యాలే అనే సంగతి అప్పట్లోనే రుజువు అయ్యింది కూడా. కానీ జగన్ ప్రభుత్వానికి జరగవలసిన డామేజీ అప్పటికే జరిగిపోయింది. ఉదాహరణకు తిరుమలకు వెళ్లే బస్ల టిక్కెట్లపై అన్యమత ప్రచారం ఉందని, కొండపై శిలువ రూపంలో లైట్లు ఉన్నాయని.. ఇలా ఒకటేమిటి దారుణమైన అబద్దాలు ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా పోటీపడి ఈ అసత్యాలను జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేసేవి. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయిన ఈ పద్దతి మానుకున్నారా? అంటే లేదు. అదే ధోరణి అనుసరిస్తున్నారు.
👉చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు అత్యంత ఘోరమైన అపచారం.. తిరుమల లడ్డూ విషయంలో చేశారు. కోట్లాది మంది పవిత్రంగా భావించే ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ బాధ్యతారాహిత్యంగా చంద్రబాబు ఆరోపణ చేశారు. దానికి అదనంగా అయోధ్యకు పంపిన లడ్డూలలో కల్తీ
లడ్డూలు వెళ్లాయని దారుణమైన అబద్దాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. తీరా చూస్తే ఇవేవి నిజం కాదని వెల్లడైంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి సరఫరా అయితే దానిని టీటీడీ అధికారులు వెనక్కి పంపినట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాంటప్పుడు జంతు కొవ్వు కలిసిన నెయ్యి లడ్డూలో ఎలా వాడతారన్నదానికి ఇంతవరకు సమాధానం లేదు. అలాగే అయోధ్యకు లడ్డూలను తయారు చేయించి పంపించింది ప్రస్తుతం టిటిడి సభ్యుడిగా ఉన్న సౌరబ్ బోరా అని తేలింది. ఆయన స్వచ్చమైన ఆవు నేయితో తయారు చేసిన లడ్డూలను పంపితే.. పవన్ కళ్యాణ్ మాత్రం తప్పుడు ఆరోపణ చేశారు. పోనీ ఆయన తన అభిప్రాయానికి కట్టుబడి బోరా పై ఏమైనా చర్య తీసుకోవాలని కోరారా? అంటే అదీ లేదు. ఇవన్నీ తిరుమలేషుని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం కాదా? అన్న ప్రశ్న వస్తే సమాధానం ఉండదు.
చంద్రబాబు తాజా తిరుమల టూర్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చూద్దాం. ఏడుకొండలను ఆనుకుని ఉన్న ప్రాంతం స్వామివారి సొంతం అని, అక్కడ ఓబెరాయ్ హోటల్కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి అభివృద్ది సంస్థ ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని మాత్రం కప్పిపెట్టారు. పైగా ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వగానే ఎల్లో మీడియా రాయలసీమలోనే మొదటి సెవెన్ స్టార్ హోటల్ అంటూ ఊదరగొట్టింది. మొత్తానికి.. సాధువుల నిరసనలతో ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దేవలోక్ ప్రాజెక్టు కు కేటాంచిన భూ అనుమతిని కూడారద్దు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టుకు 2016లో అప్పటి టిడిపి ప్రభుత్వమే విల్లాలు,గదుల నిర్మాణం నిమిత్తం అనుమతి ఇచ్చింది.
గతంలో అసెంబ్లీలో.. ఏడు కొండలు లేవు.. రెండు కొండలే ఉన్నాయని కొందరన్నారని మరో అసత్య వచనం చెప్పారు. దానిపై అప్పట్లో పోరాడనని చంద్రబాబు అంటున్నారు. అప్పుడు కూడా చంద్రబాబు అబద్దమాడినట్ట్లు ఒకటికి పదిసార్లు రుజువు అయినా అదే అసత్యం చెబుతూ ఉంటారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడు కొండలను దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో జి,ఓ.746 ఇచ్చారని ప్రస్తుత ఈఓ శ్యామలరావు హైకోర్టులో వేసిన ఒక అఫిడవిట్లో తెలిపారు.

👉ఒక వదంతిని సృష్టించడం, దానిని నిజమని ప్రచారం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన గురించి తెలిసినవారు వ్యాఖ్యానిస్తుంటారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తామని ఒకసారి , దానిని కొనసాగిస్తామని మరోసారి చెబుతున్నారు. ఇది కాకుండా కొత్తగా ఆలయాల నిర్మాణం కోసం ఇంకో ట్రస్టు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. నిజానికి శ్రీవాణి ట్రస్టు ను ఏర్పాటు చేసింది టీడీపీ హయాంలోనే అట. దానిని వైఎస్సార్సీపీ హయాంలో సమర్ధంగా నిర్వహించి విదేశాలలో, దేశ వ్యాప్తంగా 3600 దేవాలయాలను నిర్మించిందని భూమన చెప్పారు. అనేక చోట్ల కళ్యాణోత్సవాలను కూడా జరిపించారు. ఇది వాస్తవమా?కాదా?
.. ఇప్పుడేదో కొత్తగా దేశంలో టీటీడీ(TTD) తరపున ఆలయాలు నిర్మించబోతున్నట్లు బిల్డప్ ఇవ్వడం అవసరమా?. నిజంగానే శ్రీవాణి ట్రస్టు ను రద్దు చేసి ఆ నిధులను టీటీడీ సాధారణ నిధులలోకి తీసుకువస్తే రూ. 600 కోట్ల జీఎస్టీని చెల్లించవలసి వస్తుందని భూమన చెప్పారు. ఏ ఉద్దేశంతో చంద్రబాబు ఈ ట్రస్టును రద్దు చేసి మరో కొత్త ట్రస్టు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారో తెలియదు. గతంలో శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు ఆరోపించేవారు. అది నిజం కాదని పరోక్షంగా ఆయన అంగీకరిస్తున్నారనుకోవాలి.
ఇక.. తిరుమలకు నీటి కొరత రాబోతోందని, ఆలయం మూసివేయాలని ఒక అధికారి తనతో చెప్పారంటూ చంద్రబాబు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ అధికారి పేరు ఎందుకు చెప్పలేదు. నిజంగానే నీటి సమస్య వస్తే భక్తులను కొండపైకి రాకుండా ఆపుతారేమో కాని, స్వామివారి నిత్య కైంకర్యాలను ఆపి ,ఆలయాన్ని మూసివేయడం ఎక్కడైనా జరుగుతుందా? అనేదానికి జవాబు దొరకదు. ఆఖరికి సెంటిమెంట్ విషయాలలో కూడా చంద్రబాబు ఇలా మాట్లాడడమేమిటో అర్ధం కాదు.
గతంలో అప్పటి ఈఓ ధర్మారెడ్డి తనయుడు ఆకస్మికంగా చనిపోతే.. కర్మకాండ ముగిసిన తర్వాత ఆయన ఆలయానికి వస్తే దానిని తప్పుపడుతూ ఆలయాన్ని అపవిత్రం చేస్తారా? అని చంద్రబాబు, పవన్లు అన్నారన్న సంగతిని భూమన ప్రస్తావించారు. మరి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించి నెలలు తిరగకముందే.. చంద్రబాబు కుటుంబం తిరుమలకు ఎలా వస్తారని, ఇది అపవిత్రం కాదా? అని భూమన ప్రశ్నించారు.దీనికి చంద్రబాబు లేదంటే ఆయన తరపున టీటీడీ వాళ్లైనా జవాబు ఇవ్వాలి కదా!. కిక్కురుమన్నట్లు లేదు.
అంతేకాదు.సోషల్ మీడియాలో ఒక ఫొటోతో కూడా వ్యాఖ్య ఒకటి కనిపించింది. జగన్ ముఖ్యమంత్రి హోదాలో తిరుమల వెళ్లినప్పుడు స్పూన్ తో ప్రసాదం స్వీకరించడాన్ని కూడా ఆక్షేపించి తమ రాజకీయ అవసరాలకోసం చంద్రబాబు వాడుకున్నారట. మరి అదే చంద్రబాబు తన మనుమడితో పాటు స్పూన్ తోనే ప్రసాదం తీసుకుంటున్న ఫోటో కనిపించింది. నిజానికి ఇది పెద్ద అంశం కాదు. కాని చంద్రబాబు దేనినైనా రాజకీయం చేయగలరని.. తనవరకు వస్తే మాత్రం ఏమి జరగనట్లే ఉంటారని చెప్పడానికే ఇలాంటి నిదర్శనాలు అవుతాయి.
పాపనాశనం రిజర్వాయిర్లో బోటింగ్ పెట్టారట. అదే జగన్ టైంలో పెట్టి ఉంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు ఎంత గగ్గోలు పెట్టేవో?. ఇప్పుడేమో వివాదం అయ్యేసరికి అధికారులు ఏవో సాకులు చెబుతున్నారు. తిరుమల అదనపు ఈవో అచ్చంగా రాజకీయవేత్త మాదిరి.. స్థానికంగా వైఎస్సార్సీపీ అభిమానులన్న అనుమానంతో చిరువ్యాపారులను బెదిరిస్తున్నారట. సామాన్యులకే స్వామివారి దర్శనంలో ప్రాధాన్యత అని చంద్రబాబు,పవన్ కళ్యాణ్, బీఆర్ నాయుడు ఊదరగొడుతుంటారు. కాని ఆచరణలో మాత్రంఅందుకు భిన్నంగా ప్రస్తుతం రోజుకు ఎనిమిదివేల మందికి వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారట. వీటిలో అత్యధికం ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుందట. దాంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండవలసి వస్తోందని సామాన్యులు వాపోతున్నారు.
ఇక ఆలయాల కూల్చివేతలు, మఠాల భవనాల ధ్వంసం చేయడం వంటివి జరుగుతున్నా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు నోరు విప్పి మాట్లాడం లేదు. హిందూ మత ఉద్దారకులమని ప్రచారం చేసుకునే బీజేపీ సైతం వీటిని చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. మతాన్ని,దైవక్షేత్రాలను రాజకీయాలకు వాడుకుంటున్న వీరికి నిజంగా భక్తి ఉందా? అనే సందేహం ఎవరికైనా రావచ్చు. వీరు అపర భక్తులా? లేక రాజకీయ భక్తులా అంటే ఏమి చెబుతాం?.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత