‘‘రాజీనామా చేయాలని సిద్ధరామయ్య నిర్ణయం’’ | Karnataka CM Siddaramaiah has decided to resign | Sakshi
Sakshi News home page

‘‘రాజీనామా చేయాలని సిద్ధరామయ్య నిర్ణయం’’

May 27 2026 9:52 PM | Updated on May 27 2026 9:55 PM

Karnataka CM Siddaramaiah has decided to resign
  • కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఆర్‌వీ దేశ్‌పాండే వెల్లడి

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండే తెలిపారు. దేశ్‌పాండే ప్రస్తుతం పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు.  దేశ్‌పాండే బుధవారం సిద్ధరామయ్య నివాసంలో ఆయనను కలిశారు. కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయొద్దని కోరగా, తాను అధిష్ఠానానికి మాట ఇచ్చానని, ఆ మాటను గౌరవిస్తానని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన వెల్లడించారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య నివాసంలో సమావేశమై చర్చలు జరిపారు. రాజీనామా చేయొద్దని వారు కోరారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానంతో మాట్లాడతామని తెలిపారు.

కొన్ని నివేదికల ప్రకారం.. ఈ అంశంపై శాసనసభ పక్ష సమావేశంలో చర్చ జరపాలని కొందరు సూచించారు. అయితే సిద్ధరామయ్య అలాంటి సూచనలకు సానుకూలంగా స్పందించలేదు. “నేను ముఖ్యమంత్రితో ఉన్నాను. రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని సిద్ధరామయ్య చెప్పారు. ఎందుకు రాజీనామా చేస్తున్నారో నేను అడగలేదు” అని దేశ్‌పాండే చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య గురువారం లేదా ఆ తర్వాతి రోజు రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు.

“ఈ నిర్ణయం మాకు ఆశ్చర్యంగా అనిపించిందని మేము చెప్పాం. అయితే ‘లేదు, నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను’ అని ఆయన అన్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆయన కొనసాగాలని కోరారు. కానీ తాను అధిష్ఠానానికి మాట ఇచ్చానని, ఆ మాటను గౌరవిస్తానని ఆయన చెప్పారు. ఆయన కొనసాగితే మంచిదని నేను చెప్పాను. కానీ అధిష్ఠానానికి హామీ ఇవ్వడంతో రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు” అని ఆయన తెలిపారు.

సిద్ధరామయ్య ఎందుకు రాజీనామా చేస్తున్నారని తాను అడిగితే, ఢిల్లీలో చర్చలు జరిగాయని ఆయన చెప్పారని దేశ్‌పాండే వెల్లడించారు. “సీఎంగా కొనసాగాలని నేను చెప్పాను. కానీ నిర్ణయం ఆయనదే” అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఎమ్మెల్యే తెలిపారు.

కొత్త మంత్రివర్గంలో డీకే శివకుమార్‌ నేతృత్వంలో మంత్రి పదవి దక్కుతుందా? అని అడిగితే.. శివకుమార్ ముఖ్యమంత్రిగా ఎంపికైతే అది ఆయన, అధిష్ఠానం నిర్ణయిస్తారని దేశ్‌పాండే చెప్పారు. ముఖ్యమంత్రి నిరాశలో ఉన్నారా అని అడిగితే, “లేదు… ఎందుకు నిరాశ?” అని ఆయన స్పందించారు.

బుధవారం ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రులు మహదేవప్ప, అహ్మద్‌ ఖాన్‌, నంజేగౌడ, బి నాగేంద్ర, ఉమేశ్ మేటి, ఎ ఎస్ పొన్నన్న, సలీమ్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు.

సిద్ధరామయ్య మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, శివకుమార్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య గవర్నర్‌ను కలిసేందుకు సమయం కోరినట్టు సమాచారం. గురువారం తన అధికార నివాసంలో మంత్రివర్గ సహచరులతో అల్పాహార సమావేశం కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగాలని కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యను కోరిందన్న వార్తల తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement