మమతపై దాడి.. నేడు ఈసీ నిర్ణయం
కోల్కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఈనె 10వ తేదీన జరిగిన దాడి ఘటనపై ఆదివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ నుంచి, ఎన్నిల పరిశీలకుల నుంచి శనివారం నివేదికలు అందాయని వెల్లడించింది. వీటిపై ఆదివారం సమావేశమై చర్చించి, ఒక నిర్ణయం ప్రకటిస్తామని ప్రకటించింది. దాడి ఘటనపై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదిక సమగ్రంగా లేదని తెలిపింది. మమతా బెనర్జీపై దాడి నేపథ్యంలో ఆ రాష్ట్రానికి శుక్రవారం ఈసీ ఇద్దరు ఎన్నికల పరిశీలకులను కూడా పంపించింది.
ప్రమాదవశాత్తు జరిగిన ఘటన
మమతా బెనర్జీపై దాడి ఘటన అనుకోకుండా జరిగిందే తప్ప, ఉద్ధేశపూర్వకంగా చేసింది కాదని బెంగాల్కు పంపించిన ఇద్దరు పరిశీలకులు తమ నివేదికలో పేర్కొన్నారు. మమతకు సమీపంలోకి పెద్ద గుంపు చొచ్చుకు రావడంతో ఆమె గాయపడ్డారనీ, ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న ఈ పరిణామాన్ని అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. దీని వెనుక కుట్రకోణమేదీ లేదని తేల్చారు.OK