అలాగైతే మేం ఎన్నికల్లో పోటీ చేయం: సీఎం రేవంత్‌ | Cm Revanth Reddy Challenges Brs Party | Sakshi
Sakshi News home page

అలాగైతే మేం ఎన్నికల్లో పోటీ చేయం: సీఎం రేవంత్‌

May 30 2026 7:08 PM | Updated on May 30 2026 7:42 PM

Cm Revanth Reddy Challenges Brs Party

సాక్షి, హైదరాబాద్‌: మోటర్లకు మీటర్లు పెట్టినా.. రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేం ఎన్నికల్లో పోటీ చేయం.. ఒక వేళ మోటర్లకు మీటర్లు పెట్టకపోయినా.. ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్‌ఎస్‌ తప్పుకుంటుందా? అంటూ ఆ పార్టీకి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.

‘‘రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిచేందుకే రైతు డిస్కం. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కమ్‌కు కనెక్ట్ చేస్తున్నాం. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఎక్కడాలేని విధంగా రైతు డిస్కంను ఏర్పాటు చేశాం. రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రభుత్వానికి అవసరాన్నిబట్టి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి’’ అంటూ రేవంత్‌ దుయ్యబట్టారు.

‘‘కిషన్‌రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. వడ్లు కొనంది మీరు.. రైతు పండించిన ప్రతీ గింజను మా ప్రభుత్వం కొంటుంది. మేం కొంటున్నది ఎంత.. కేంద్రం కొనేది ఎంత?. కేంద్రం ఎంఎస్పీ నిర్ణయించింది కానీ ఒక్క గింజనైనా కొంటున్నారా?. వరి, జొన్న, మొక్కజొన్నలు మొత్తం మా ప్రభుత్వం కొంటుంది. మేం కొన్న మొత్తం పంట కేంద్రం కొనాలి. కేంద్రం కొనకపోవడం వల్లే రాష్ట్రంలో రైతు గోస పడుతున్నాడు. కేంద్రం కొనకపోతే బస్సులు వేసుకుని వెళ్లిన వాళ్ల దగ్గరికే ట్రాక్టర్లు వేసుకుని వెళతాం. జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. కానీ తుమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరినా స్పందించడంలేదు’’ అంటూ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement