ఫస్ట్‌ హాఫ్‌ ఫెయిల్‌ | BRS Working President KTR Fired On Congress Govt | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ హాఫ్‌ ఫెయిల్‌

Jun 14 2026 5:52 AM | Updated on Jun 14 2026 5:52 AM

BRS Working President KTR Fired On Congress Govt

అన్ని రంగాల్లో రేవంత్‌ సర్కారు వైఫల్యం 

ధాన్యంలో తరుగు పేరుతో రైతుల నిలువు దోపిడీ 

రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్‌బంధు’ మొదలుపెట్టారు 

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌ 

పార్టీ డిజిటల్‌ సభ్యత్వం విజయవంతం చేయాలని పిలుపు

సిరిసిల్ల:  రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, రేవంత్‌ సర్కార్‌ అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు విమర్శించారు. ఈ ప్రభుత్వ పాలన మొదటి అంకం (ఫస్ట్‌ హాఫ్‌) విఫలమైందని చెప్పారు. సినిమా ఫస్ట్‌ హాఫ్‌ డిజాస్టర్‌ అయినప్పుడు సెకండ్‌ హాఫ్‌పై ఎలాంటి ఆశలు ఉండవో.. ప్రభుత్వ ప్రస్తుత పనితీరు కూడా అలాగే ఉందని అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడల్లో పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై బూత్‌ లెవల్‌ ఏజెంట్లతో బీఆర్‌ఎస్‌ శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యంలో తరుగు పేరుతో రైతులను నిలువునా మోసం చేస్తోందని ఆరోపించారు. ఎరువుల దుకాణాల వద్ద మళ్లీ క్యూలైన్‌లో నిలబడే దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే, రాహుల్‌గాందీకి మాత్రం సంచుల కొద్దీ డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు. రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్‌బంధు’మొదలుపెట్టారని విమర్శించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ఎన్నికలకు ముందు బాండ్‌ పేపర్‌ రాసిస్తానన్న హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని, దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

రూ.4 లక్షల కోట్ల అప్పుతో చేసిందేమిటో చెప్పాలి 
హిట్లర్‌ స్ఫూర్తి అయితే పాలన గిట్లనే ఉంటదని కేటీఆర్‌ అన్నారు. మీనాక్షి నటరాజన్‌కు అవమానం జరిగేలా వ్యవహరించిన వ్యక్తి రేవంత్‌రెడ్డేనని ఆరోపించారు. ప్రజలు పాలు ఇచ్చే బర్రెను వదిలి, తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుగా కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌కు అధికారం మాత్రమే పోయిందని, కేసీఆర్‌పై ప్రజల అభిమానం తగ్గలేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రతిసారీ కేసీఆర్‌ అప్పు చేశారంటుంటారని..అయితే కేసీఆర్‌ అప్పు చేసినా అభివృద్ధి చేశారని, రైతుల ఖాతాల్లో రూ.77వేల కోట్లు వేశారని, 15 లక్షల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మీ ఇచ్చారని, కొత్త జిల్లాలు, కొత్త కలెక్టరేట్లు, మెడికల్‌ కాలేజీలు, గురుకులాలు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టారని వివరించారు. రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి రేవంత్‌రెడ్డి తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని సవాల్‌ విసిరారు.  

సభ్యత్వ నమోదు, ‘సర్‌’పై పాఠాలు 
‘నాకు జన్మనిచ్చింది శోభమ్మ అయితే, రాజకీయంగా పునర్జన్మనిచ్చింది సిరిసిల్ల ప్రజలే. ఒక్క రూపాయి.. చుక్క మద్యం పంచకుండా ప్రజల ఆశీర్వాదంతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచినందుకు గర్వపడుతున్నా..’అని కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో సిరిసిల్లను జిల్లా చేసి రూపురేఖలు మార్చామని, ప్రాణం ఉన్నంత వరకు సిరిసిల్ల అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు. బీఆర్‌ఎస్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్‌ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాయని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 25 తర్వాత వేములవాడలోని ప్రతి మండలాన్ని సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటానని ప్రకటించారు. కాగా పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై శ్రేణులకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఎస్‌ఐఆర్‌పై పాఠం మాదిరి అవగాహన కల్పించారు. మాజీ మంత్రి, సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి, నేతలు చెలిమెడ లక్ష్మీనర్సింహారావు, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement