అక్రమాలు, స్కామ్లపై కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పినందుకే మీనాక్షిపై రేవంత్రెడ్డి దొంగకేసు
ప్రజలకే కాదు.. సొంత పార్టీకీ శఠగోపం పెట్టారు
సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
బంజారాహిల్స్(హైదరాబాద్): సీఎం రేవంత్రెడ్డి సొంతపార్టీ నేతలకే వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మీనాక్షీ నటరాజన్కు పదవి రాకుండా అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టించడం రేవంత్రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం తెలంగాణభవన్లో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్లో ఉన్న కొంతమందిలో మీనాక్షి నటరాజన్ నిజాయతీ గల మనిషి అని, రాహుల్గాందీకి నమ్మిన బంటు కావడంతోనే రేవంత్రెడ్డి ఆమె పైనే కుట్ర చేశారన్నారు. తెలంగాణలో రేవంత్రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటూ అడ్డగోలు అవినీతి చేస్తున్నాడని మీనాక్షి నటరాజన్ రాహుల్గాందీకి చెప్పినందుకే రేవంత్రెడ్డి ఆమెపై పగపట్టారని చెప్పారు. అందుకే మీనాక్షి నటరాజన్ మీద రేవంత్రెడ్డి దొంగ కేసు పెట్టించారన్నారు. ఆ కేసు వివరాలు కూడా బీజేపీకి ఇచ్చారని ఆరోపించారు. ఇలా ప్రజలకే కాకుండా సొంతపార్టీ వారికే గుండుకొట్టి శఠగోపం పెట్టిన దొంగ రేవంత్రెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్ను ఆదర్శంగా తీసుకుంటున్నానని సీఎం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రేవంత్రెడ్డి పాలనను అట్టర్ఫ్లాఫ్గా అభివర్ణించారు. సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్టేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్కే ఫ్లాప్ అని తేలిపోయిందన్నారు.
మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి..?
నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని హామీఇచ్చిన రేవంత్రెడ్డి అది నెరవేరితే నిరూపించాలన్నారు. అదే జరిగితే తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. జీఓ నంబర్ 50 ద్వారా పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. నగరంలో ఇటుక కూడా వేయని కాంగ్రెస్ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. నగరంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని ఉచితంగా అందిస్తామన్నారు. ఖైరతాబాద్లో రెండుసార్లు గులాబీ జెండా ఎగురవేశామని, మూడోసారి కూడా సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి రేవంత్రెడ్డి పక్కన కూర్చున్నారన్నారు. త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు.
‘సర్’విషయంలో బాధ్యతాయుతంగా పనిచేయాలి
జూన్ 25 నుంచి జూలై 31 వరకు జరిగే ‘సర్’నమోదులో ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ బాధ్యతగా పనిచేయాలని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే కొత్త కమిటీలు వేయబోతున్నామని, టికెట్ ఆశించేవారు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ మన్నె గోవర్దన్రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, బీఆర్ఎస్ నేతలు జేజోళ్ల రాజుముదిరాజ్, మహేశ్యాదవ్, హేమలతాయాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


