సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్పై కొత్త కుట్రకు తెర లేపారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ కొత్త కుట్రకు తెర లేపుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో మా ప్రజల స్వరం తగ్గిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చంచారు. అలాగే, మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది.
మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా మాట్లాడుతూ..‘డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాదికి అన్యాయం జరిగితే పెను ఉద్యమం తప్పదు. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. మూడేళ్ల క్రితం తీసుకున్న దృఢమైన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. మేమంతా గర్వించదగ్గ భారతీయులం. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలం మేము. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం చేయడం సమంజసం కాదు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం.
దేశ అత్యున్నత వేదిక అయిన పార్లమెంటులో మా ప్రజల స్వరాన్ని అణచివేయాలని చూస్తే.. మేము మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకోము. అవసరమైతే కేసీఆర్ ముందుండి కొట్లాడుతారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తాం. ఇప్పటికైనా ఢిల్లీ పాలకులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని, విజ్ఞత ప్రదర్శించాలి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మా మద్దుతు ఉంటుంది’ అని స్పష్టం చేశారు.


