హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేతలపై, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇంకా బీఎల్ఓ జాబితాను బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 31 నియోజకవర్గాల నుంచి జాబితా రాలేదని, సభ్యత్వ నమోదులో చురుగ్గా లేకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు కేసీఆర్.
ఈరోజు(సోమవారం, ఏప్రిల్ 27వ తేదీ) తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఓ జాబితాను కేసీఆర్ ప్రస్తావించారు. దీనికి బీఆర్ఎస్ నేతల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘15రోజుల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలి. టికెట్ కేటాయింపులకు సభ్యత్వ నమోదు ప్రామాణికం. సోషల్ మీడియాలో యాక్టివ్గా కాదు.. ఫీల్డ్లో యాక్టివ్గా ఉండాలి. సభ్యత్వ నమోదును పట్టించుకోకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది,. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అని కూడా చూడను.. టికెట్ ఇవ్వను. నేను ఒకసారి చెబితే.. వెయ్యి సార్లు చెప్పినట్లే’ అని హెచ్చరించారు.


