West Bengal Bypoll 2021: మమత నామినేషన్ తిరస్కరించండి
Published
Wed, Sep 15 2021 10:12 AM
కోల్కతా: భవానీపూర్ ఉప ఎన్నికకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్లో ఆమెపై ఉన్న క్రిమినల్ కేసులను వెల్లడించలేదని, అందువల్ల ఆమె నామినేషన్ను తిరస్కరించాలంటూ ఎన్నికల కమిషన్కు బీజేపీ లేఖ రాసింది. అయితే ఆ కేసులు మమతపై ఉన్నవి కాదని ఎన్నికల కమిషన్ ఇది వరకే తేల్చిందని టీఎంసీ స్పష్టం చేసింది. బీజేపీ తరఫున భవానీపూర్ బరిలో దిగుతున్న ప్రియాంక తిబ్రేవాల్కు, నియోజకవర్గానికి బీజేపీ ఎన్నికల చీఫ్ ఏజెంట్గా ఉన్న సజల్ ఘోష్ ఈసీకి లేఖ రాశారు.
తనపై ఉన్న క్రిమినల్ కేసులను వెల్లడించడంలో మమత విఫలమైనందున ఆమె నామినేషన్ను తిరస్కరించాలని లేఖలో పేర్కొన్నారు. టీఎంసీ నేత, బెంగాల్ రవాణా మంత్రి ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ.. బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. మమత బెనర్జీ పేరుతో ఉన్న మరో మహిళపై ఆ కేసులు నమోదయ్యాయని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ కూడా గత ఎన్నికల్లో స్పష్టం చేసిందని చెప్పారు.