
సాక్షి,గుంటూరు: పోలీసుల్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో ఆధిపత్య పోరులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. అయితే, ఈ హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడికి అంటగట్టడంపై అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న కుట్రలపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. నిన్న (శనివారం) పల్నాడులో దురదృష్టకరమైన ఘటన జరిగింది. తెలంగాణలో హుజూర్ నగర్ జిల్లాలో ఓ వివాహానికి హాజరై బైక్పై గ్రామానికి తిరిగి వెళ్తున్న జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావు వెల్దుర్తి మండలం బొదిలవీడు సమీపంలో ఓ స్కార్పియో కారు వీరి బైక్ను వేగంగా ఢీకొట్టి దారుణంగా హత్య చేశారు.
ఆధిపత్య పోరుతోనే హత్య జరిగిందని స్వయంగా పల్నాడు ఎస్పీ తెలిపారు. ఇరు వర్గాల వారు ఒకే పార్టీకి చెందిన వారేనని ఎస్పీ చెప్పారు. అయితే, టీడీపీలో రెండు వర్గాల ఆధిపత్య పోరుతో జరిగిన హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడుకి అంట గట్టారు.
హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన స్కార్పియోపై జేబీఆర్ అని ఉంది. జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి. హత్యకు గురైన వారి బంధువులు కూడా తెలుగుదేశం నాయకులే చంపారని చెప్పారు. కానీ ఈ హత్యలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని ఇరికించడం దారుణం.
జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అనుకూల మీడియా సైతం టీడీపీలో ఆధిపత్య పోరువల్లే ఈ డబల్ మర్డర్ జరిగాయి’ అని వార్తలు రాశాయి. టీడీపీ నాయకుల హత్యలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏంటి సంబంధం?

డెడ్ బాడీలు దొరికితే వైఎస్సార్సీపీ నేతలపైన పోలీసులు హత్య కేసులు నమోదు చేస్తారని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇవాళ అదే జరిగింది. ఆదిపత్య పోరు కారణంగా జవిశెట్టి సోదరులు హత్యకు గురైతే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పైన పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు.
దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఇటీవలే హరికృష్ణ అనే వైసీపీ కార్యకర్తపై అక్రమ కేసు నమోదు చేసి, కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. గురజాల డీఎస్పీ జగదీష్ నీతి, నిజాయితీతో పని చేస్తే తాము చెప్పిన మాట వినలేదని ట్రాన్స్ఫర్ చేశారు. పోలీసులు టీడీపీకి జేబు సంస్థగా పని చేస్తున్నారు. అక్రమ కేసులు నమోదు చేసే పోలీసులు తగిన మూల్యం చెల్లించక తప్పదు’ అని హెచ్చరించారు.