పెద్దపల్లి: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. గోదావరిఖని గర్నమెంట్ జనరల్ ఆస్పత్రి పనితీరుపై అదనపు కలెక్టర్ అరుణశ్రీ, రామగుండం మేయర్ మహంకాళి స్వామితో కలిసి మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. అన్ని విభాగాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవుట్ సోర్సింగ్ విధానంలో ఖాళీలు భర్తీ చేయాలని తెలిపారు. డయాగ్నొస్టిక్ హబ్ సేవల్లో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారు. ఆస్పత్రి నుంచి వెలువడే వ్యర్థాలను నిబంధనల ప్రకారం డిస్పోస్ చేయాలని సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మే 1 నుంచి జాబ్మేళాలు
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా మే ఒకటి నుంచి 13వ తేదీ వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెగా జాబ్మేళాలు నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మెగా జాబ్మేళా నిర్వహణపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. మెరుగైన ఉపాధి అవకాశాలు సాధించేలా యువతను సిద్ధం చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మధ్యవర్తులు అవసరం లేదని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ప్రజా సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రతీ బుధవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు, పరిశ్రమల అధికారి కీర్తికాంత్, టాస్క్ సెంటర్ అధికారి కౌసల్య, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
సేవలు అందించాలి
జూలపల్లి: అధికారులు తమ సేవలను సమర్థవంతంగా అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. తెలుకుంట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, పెద్దాపూర్ ఆదర్శ విద్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఆందించాలని సూచించారు. అనంతరం జూలపల్లి తహసీల్దారు కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు.


