రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ దుర్మరణం

Apr 8 2026 7:02 AM | Updated on Apr 8 2026 7:02 AM

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాజీవ్‌ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ ఎండీ ఇస్మయిల్‌(50)దుర్మరణం చెందాడు. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీకళాశాల సమీపంలోని రాజీవ్‌ రహదారిపై వెళ్తున్న ఆటోను వెనకాల వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో ఆటోడ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీస్‌ల కథనం ప్రకారం.. రామగుండం ముబారక్‌నగర్‌కు చెందిన ఎండీ ఇస్మాయిల్‌ మంగళవారం వేకువజామున తన ఆటోలో ఎన్టీపీసీ నుంచి గోదావరిఖని బస్టాండ్‌ వైపు బిజిలీ రాధ అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని ఎక్కించుకుని వస్తున్నాడు. హైదరాబాద్‌ నుంచి వెనకాలే వచ్చిన షిఫ్ట్‌కారు బలంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటో తలకిందులు కాగా బిజిలీ రాధ తలకు గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. కారు కూడా తలకిందులైంది. స్థానిక కల్యాణ్‌నగర్‌కు చెందిన బొంకూరి పవన్‌కుమార్‌ తనమిత్రులు చిరంజీవి, రాజేశ్‌తో కలిసి హైదరాబాద్‌ వెళ్లి తిరిగి వస్తుండగా ఈప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న పవన్‌కుమార్‌, చిరంజీవి, రాజేశ్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇస్మాయిల్‌ మృతి చెందారు. మృతుడి సోదరుడు ఇబ్రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఇంద్రసేనారెడ్డి కేసునమోదు చేసుకున్నారు.

కళ్లెదుటే ఉంటానన్నాడు.. కనిపించకుండా పోయాడు

రామగుండం: ‘కళ్లెదుటే ఉంటానన్నాడు.. కనిపించకుండా పోయాడు.. హెవీలైసెన్స్‌ ఉంది.. డ్రైవింగ్‌లో నిష్ణాతుడు.. దూర ప్రాంతాలకు వెళ్తే కుటుంబసభ్యులకు రోజుల తరబడి దూరంగా ఉండాల్సి వస్తుందన్నాడు.. నేషనల్‌ హైవేలపై అనూహ్య ఘటనలు జరిగితే భార్యాపిల్లల భవితవ్యం ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన చెందాడు.. అందుకే మూడేళ్లక్రితం ఆటో కొనుగోలు చేశాడు.. స్థానికంగానే ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకున్నాడు. లారీ డ్రైవర్‌ పని వద్దనుకున్నా మృత్యుడు మాత్రం వెంటాడింది’ అని మృతుడి భార్య నసీమా, కూతుళ్లు తహసీన్‌, తన్వీర్‌ రోదిస్తున్న తీరు ప్రతీఒక్కరిని కంటతడి పెట్టించింది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా రామగుండం ముబారక్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఇస్మాయిల్‌(36)తోపాటు తండ్రి, నలుగురు కుమారులు డ్రైవర్లుగానే పనిచేస్తున్నారు. ఇస్మాయిల్‌కు 17ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. అయోధ్యనగర్‌లో భార్యాపిల్లలతో వేరేకాపురం పెట్టాడు. లారీలు రోడ్డు ప్రమాదాలకు గురై డ్రైవర్లు మృత్యువాత పడుతుండడంతో భార్య నసీమా.. భారీ వాహనాల డ్రైవింగ్‌ వద్దని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మూడేళ్లక్రితం ఆటో కొనుగోలు చేసి స్థానికంగానే నడుపుతున్నాడు. పెద్ద కూతురు తహసీన్‌ ఇంటర్మీడియట్‌, చిన్న కూతురు తన్వీర్‌ పదో తరగతి చదువుతోంది. మరోమూడు రోజుల్లో ఈమే చివరి పరీక్ష రాయాల్సి ఉంది. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతో భార్య కుట్టుమిషన్‌తో వచ్చే సంపాదన ఇంటి ఖర్చులకు ఆసరాగా నిలుస్తోంది. ఎంతోహాయిగా సాగిపోయే కుటుంబంలో గోదావరిఖనిలో మంగళవారం కారు, ఆటో ఢీకొన్ని ప్రమాదంలో ఇస్మాయిల్‌ దుర్మరణం చెందడం తీవ్ర విషాన్ని నింపింది. ముబారక్‌నగర్‌, అయోధ్యనగర్‌ కాలనీవాసులు శోకసంద్రంలో మునిగిపోయారు.

గోదావరిఖనిలో కారు, ఆటోఢీ

రాజీవ్‌ రహదారిపై ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement