సీనియర్ సీఆర్పీ సేవలు వినియోగించుకోవాలి
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లాకు కేటాయించిన వరంగల్ సీనియర్ సీఆర్పీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్లో మండల, గ్రామ సమాఖ్యలకు అందించే ప్రత్యేక శిక్షణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ– సెర్ప్ సీఈవో ఆదేశాల మేరకు జిల్లాలో వరంగల్ మహా సమాఖ్య ఆధ్వర్యంలో 8మంది సీనియర్ సీఆర్పీలతో 13 మండలాల్లో 15 సమాఖ్యలకు, 12గ్రామ సమాఖ్యలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. డీఆర్డీవో కాళిందని, అదనపు డీఆర్డీవో బి.రవీందర్, డిపీఎం కే.రవి పాల్గొన్నారు.
100శాతం ఇందిరమ్మ
ఇళ్ల గ్రౌండింగ్ చేయాలి
ఇందిరమ్మ ఇళ్లకు 100శాతం గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంపై సమీక్షించారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను ప్రారంభించాలన్నారు. మార్కింగ్ చేసిన ఇళ్లు బేస్మెంట్స్థాయికి చేరుకునేలా హౌసింగ్శాఖ అసిస్టెంట్ ఇంజినీర్లు, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు. లబ్ధిదారులకు పెట్టుబడి సమస్య ఉంటే మహిళా సంఘాల ద్వారా రుణం ఇప్పించాలని, ఇళ్లనిర్మాణంలో అలసత్వం వహిస్తే మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేయాలన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు.
కిసాన్ కపాస్పై అవగాహన కల్పించాలి
జిల్లాలో పత్తిని మద్దతు ధరకు సీసీఐ కేంద్రాల్లో విక్రయించేలా కపాస్ కిసాన్ యాప్పై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి వానాకాలం పంట కొనుగోళ్లపై సమీక్షించారు. ఇప్పటి వరకు రెండు సీసీఐ కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు. జిల్లాలోని ఓదెల, శ్రీరాంపూర్ మండలాల్లో 596 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైందని, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన 48గంటల్లోపు రైతు ఖాతాలో డబ్బు జమచేయాలన్నారు.
కలెక్టర్ను కలిసిన ఎంపీడీవోలు
గ్రూప్– 1లో ఎంపికై జిల్లాకు కేటాయించిన ముగ్గురు ఎంపీడీవోలు మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాద పూర్వకంగా కలిశారు. వీరిలో మంథని ఎంపీడీవో కంకణాల శ్రీజరెడ్డి, అంతర్గాం ఎంపీడీవో వేముల సుమలత, కమాన్పూర్ ఎంపీడీవో సాదినేని ప్రియాంక ఉన్నారు. హర్షవిజిలెన్స్ వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. హౌసింగ్ పీడీ రాజేశ్వర్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు.


