పార్వతీపురం: ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోర్సులను తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మేర కు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి చేయని శాఖలు వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసి వచ్చే సోమవారం నాటికి 100 శాతం రిజిస్ట్రేషన్లు సాధించాలని సూచించారు. ఈ నెలాఖ రు నాటికి కనీసం 54 ఆన్లైన్ కోర్సులను పూర్తి చేసి ఉండాలని స్పష్టం చేశారు. కోర్సుల ప్రగతిని ప్రతినెలా సమీక్షిస్తామని, నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఫోన్ ఇన్కు స్పందన
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యానాణ్యత, విద్యార్థుల సంక్షేమంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సోమవారం నిర్వహించిన ప్రత్యేక ‘ఫోన్ ఇన్’ కార్యక్రమానికి స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 15మండలాల నుంచి మొత్తం 58 కాల్స్ వచ్చాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాలల మౌలిక సదుపాయాలు, విద్యానాణ్యత, సంక్షేమ కార్యక్రమాలపై సూచనలు, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ‘‘మన్యం డ్యాన్స్’’ ‘‘మెగా కోలాటం’’ ‘‘ ఆనందలహరి’’ ‘‘ ముస్తాబు’’ వంటి వినూత్న కార్యక్రమాల వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగి, విద్యార్థుల ప్రవేశాలు, హాజరు మెరుగుపడ్డాయని పలువురు అభినందించారు. విద్యార్థుల సామర్థ్యాలు, అభిరుచులను గుర్తించేందుకు సైకో మెట్రిక్ పరీక్షలు నిర్వహించాలని విద్యావేత్తలు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో విద్యారంగ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని కలెక్టర్ తెలిపారు.


