చీపురుపల్లిరూరల్(గరివిడి): నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతో కష్టంగా మారిన తరుణంలో గరివిడి మండలంలోని అర్తమూరు గ్రామానికి చెందిన యువ ఇంజినీర్ సుంకరి నరసింహనా యుడు ఏకంగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. 2000వ సంవత్సరంలో బీటెక్ పూ ర్తిచేసిన నరసింహనాయుడు ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం ఐదేళ్లు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా ఇంటి నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమై వరుస విజయాలు సాధించాడు.
ఉద్యోగాలు పొందింది ఇలా..
.2025 జూన్లో రైల్వే రిక్రూట్మెంట్లో జూనియర్ ఇంజినీర్(జేఈ) ఉద్యోగం సాధించాడు. సుమారు ఏడాది తరువాత మూడు నెలల క్రితం ఉద్యోగంలో చేరాడు. చైన్నెలో ఉద్యోగంలో శిక్షణ పొందుతున్న నరసింహనాయుడికి తాజాగా (నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్) నాల్కో ప్రభుత్వ రంగ సంస్థలో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.ఈ ఉద్యోగానికి కూడా 2025 ఫిబ్రవరిలో గేట్ ఎగ్జామ్ రాసి 100కి 76 మార్కులు సాధించాడు.ఈ ఉద్యోగానికి సంబంధించి ఏడాది కాలం తరువాత 2026 మార్చిలో నిర్వహించిన ఇంటర్వ్యూలో ప్రతిభ చూపడంతో ఈ సంస్థలో ఉద్యోగం సాధించాడు. ఈ ఉద్యోగం కోసం ఒడిశా రాష్ట్రంలోని దమన్జోడి ప్రాంతంలో రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరనున్నాడు. ఈ ఉద్యోగంలో చేరేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కేంద్ర ప్రభుత్వ సంస్థలో నిర్వహించిన ఉద్యోగానికి గేట్ ఎంట్రన్స్ ద్వారా ఎంపికై ఉన్న ఆయనకు 2026 మే నెలలో అపాయింట్మెంట్ ఆఫర్ వచ్చింది. ఇలా ఆయన మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు సాధించాడు. నరసింహనాయుడి ప్రతిభ పట్ల గ్రామస్తులు అభినందనలు తెలియజేస్తున్నారు.


