పార్వతీపురం రూరల్: విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి ’యోగాంధ్ర’ పోటీలకు పార్వతీపురం మన్యం జిల్లా బృందం బుధవారం పయనమైంది. ఈ మేరకు కలెక్టరేట్ ఆవరణలో డీఆర్వో, జాయింట్ కలెక్టర్ (ఎఫ్ఏసీ) కె.హేమలత క్రీడాకారుల బృందం వెళ్లే ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి సాగనంపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా నుంచి జూనియర్, యంగ్, సీనియర్ కేటగిరీల్లో మొత్తం 35 మంది అభ్యర్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా జిల్లాస్థాయిలో నిర్వహించిన సోలో, గ్రూప్ యోగా, ప్రాణాయామం, క్విజ్, స్లోగన్, వ్యాసరచన, పాటలు, షార్ట్ ఫిల్మ్ తదితర విభాగాల్లో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసినట్లు నోడల్ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు తెలిపారు. ప్రయాణంలో క్రీడాకారుల సౌకర్యార్థం బస్సులో వైద్య సిబ్బందిని, ప్రథమ చికిత్స కిట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందానికి గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయశాంతి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో ఆయుష్ జిల్లా ఇన్న్చార్జి అధికారి డాక్టర్ టి.హేమాక్షి, వైద్యాధికారులు వర్మ, మహేష్, యోగా గురువులు మోహన్ గంతాయత్, జనార్దనరావు, పీడీ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.


